2009లో జోగి రమేష్ మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోగి టిక్కెట్ కు అడ్డు చెప్పడంతో... వైఎస్ చివర్లో రమేష్ కు పెడన సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత కాగిత వెంకట్రావు ను ఓడించి జోగి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. 2014లో మాత్రం జోగి ఉమా పై పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ కోసం మళ్ళీ జోగి పెడన నుంచి పోటీ చేసి కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్ ను ఓడించి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు.
బీసీ నేత కావడం, గౌడ సామాజిక వర్గం లో సీనియర్ నేత అవ్వడంతో జోగి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని రెండేళ్ల నుంచి ఆశలతో ఉన్నారు. ఇటీవల చంద్రబాబు ఇంటి పై దాడి తర్వాత జోగికి పార్టీలో మైలేజ్ వచ్చింది కూడా..! అలాంటి జోగికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి. నియోజకవర్గ కేంద్రమైన పెడన జడ్పిటిసి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి విజయం సాధించింది.
ఈ పరిణామాల పట్ల పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. జిల్లాలో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే జోగి కి ఇక ఆ ఛాన్స్ ఇక లేనట్టే... అని అవసరమైతే మాజీ మంత్రి పార్థసారథి కి ఛాన్స్ వస్తుంది కానీ జోగిని జగన్ పట్టించుకోరని అంటున్నారు.