ఇద్దరు భేటీ అవటానికి ఏదో ఒక సాకు కావాలి. అందుకు కుప్పంలో జరిగిన పరిణామాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే  చంద్రబాబు ఇంటికి వెళ్ళిన పవన్ దాదాపు మూడుగంటలు భేటీఅయ్యి పొత్తులు ఖాయం చేసుకున్నారు. నిజానికి కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ఎదురైన ఇబ్బందులు ఏమీలేవు. రోడ్డుషోలు, రోడ్లపై సభలు నిర్వహించద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించటమే టార్గెట్ గా చంద్రబాబు మూడురోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు.





తన పర్యటనలో అడుగడుగునా చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తాను అనుకున్నట్లే చేశారు. కుప్పం పర్యటనలో ప్రభుత్వం అడ్డుకున్నదీ లేదు, చంద్రబాబు ఇబ్బందులు పడిందీ లేదు. అయినా చంద్రబాబును పవన్ పరామర్శ చేశారంటే అర్ధమేంటి ? ఏమిటంటే వీళ్ళిద్దరు భేటీ అవదలచుకున్నారు, అయ్యారంతే. భేటీ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుతు జగన్ కుట్రలను ఇద్దరం కలిసే ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇతర పార్టీలు కూడా తమకు మద్దతుగా కలిసిరావాలన్నారు. గతంలో కూడా ఇలాగే ప్రకటించినా బీజేపీ కుదరదు పొమ్మన్నది.





ఇక్కడే పవన్ ఆలోచన ఏమిటో అర్ధమవుతోంది. బీజేపీని వదిలేసి చంద్రబాబుతో కలవటానికి పవన్ అవకాశంకోసం ఎదురుచూస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ నేతలతో భేటీ అవలేదు. అందుకనే బీజేపీతో ఉంటునే చంద్రబాబుతో కలిసి పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీతో కలిసి ఉమ్మడిపోరాటాలు చేయటానికి వీలుగా బీజేపీని కూడా ఒప్పిస్తానని మొక్కుబడి ప్రకటనొకటి చేశారు.





ఇప్పటికైతే చంద్రబాబుతో కలిసేట్లుగా బీజేపీని ఒప్పించేంత సీన్ పవన్ కు లేదని అందరికీ తెలుసు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవటమన్నది రాష్ట్రంలోని నేతల ఇష్టప్రకారం జరిగేదికాదు. టీడీపీతో కలవాలని నరేంద్రమోడీ అనుకుంటే మాత్రమే జరుగుతుంది. టీడీపీకి అనుకూలంగా మోడీని ఒప్పించేంత స్ధాయి పవన్ కు లేదు. కాబట్టి పవన్ ముందున్న ఆప్షన్ ఏమిటంటే ఏదోవిధంగా బీజేపీని వదిలించుకుని చంద్రబాబుతో కలిసిపోవటమే. కాకపోతే అలాచేస్తే జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు  చంద్రబాబు, పవన్ సిద్ధపడాల్సుంటుంది. అప్పుడే పవన్ అనుకున్నట్లు జరుగుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: