టెస్టు మ్యాచ్ల్లో విజయాలు భారత్ జట్టుకు అలవాటుగా మారిపోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లి అభిలషించాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం మీడియాతో కోహ్లి మాట్లాడాడు. టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో టీమిండియాకు విజయాలు సాధించడం ఓ అలవాటుగా మారిపోవాలని ఆయన ఆకాంక్షించాడు.
తాము గెలుపును అలవాటుగా మార్చుకునేందుకు కృషి చేస్తున్నామని, మ్యాచ్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారిస్తున్నామని కోహ్లీ పేర్కొన్నాడు. తొలి టెస్టులో జట్టులోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన అన్నాడు. అందుకే తొలిటెస్టులో గెలుపు సాధ్యమైందని అన్నాడు.
ఈ టెస్టులో కోహ్లి ద్విశతకంతో రాణించగా.. అశ్విన్ శతకం సాధించడంతో పాటు 7 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టులోనే ఘన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.