జనాల చెవిలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇన్చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి పూలు బాగానే పెడుతున్నారు. విభజన హామీల గురించి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేసిన కారణమేంటో తాజాగా బయటపెట్టారు. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే, పోలవరం నిర్మాణం కోసం తెలంగాణాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులో పెట్టలేదట. అందుకనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.
త్యాగమయిలా ఫోజులా ?
పురంధేశ్వరి మాటలు విన్నవాళ్లందరూ ఏమనుకోవాలి ? రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కేంద్రమంత్రి పదవినే త్యాగం చేశానని అందరూ అనుకోవాలన్నది బహుశా పురంధేశ్వరి ఉద్దేశ్యం కావచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, కేంద్రమంత్రిగా ఉంటూ కనీసం రాష్ట్ర ప్రయోజనాలను పురంధేశ్వరి ఏమాత్రం అడ్డుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా సమైక్య రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయమైన తర్వాత కనీసం నిరసన కూడా తెలపలేదు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించను కూడా లేదు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత కూడా మంత్రిగానే కంటిన్యూ అయిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రజాగ్రహానికి గురైన పురంధేశ్వరి
రాష్ట్ర విభజన తప్పదు అని తేలిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే పురంధేశ్వరి సీమాంధ్ర పర్యటనల్లో తన వాదన వినిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. విభజనకు అనుకూలంగా వదన వినిపించినందుకు పురంధేశ్వరి అనేక చోట్ల ప్రజాగ్రహానికి కూడా గురయ్యారు. ఇంతకీ ఈ మాజీ కేంద్రమంత్రి ఎప్పుడు రాజీనామా చేశారంటే జనాలు ఆగ్రహం చూసిన తర్వాత సీన్ అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపిలో భవిష్యత్తు లేదు అని అర్ధమైన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ముంపు మండలాలను ఏపిలో కలిపింది కాంగ్రెస్సే
సీన్ అర్ధమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంత తొందరగా రాజీనామా చేశారో అంతే తొందరగా బిజెపిలో చేరిపోయారు. బిజెపిలో కూడా ఎందుకు చేరారంటే, దేశవ్యాప్తంగా నరేంద్రమోడి హవాను అంచనా వేయటంలో మాత్రం ఈ మాజీ మంత్రి సక్సెస్ అయ్యారు. మోడి హవాలో తాను ఎంపిగా ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిచిపోతానని అనుకున్నట్లున్నారు. అందుకనే రాయలసీమలోని రాజంపేట లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారను కోండి అది వేరే సంగతి. గెలిచుంటే మళ్ళీ కేంద్రమంత్రి పదవికి పోటీ పడేవారనటంలో సందేహమే లేదు. ఓడిపోయారు కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు. ఇంతకీ ముంపు మండలాల విషయంలో పురంధేశ్వరి చెప్పింది పూర్తిగా అబద్దమేనట.ఎందుకంటే, తెలంగాణాలోని ఏడు మండలాలను ఏపిలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది నాటి యూపిఏ ప్రభుత్వమే. కాకపోతే ఆ నిర్ణయం అమలైంది మాత్రం ఎన్డీఏ ప్రభుత్వంలో.