మొత్తానికి కర్నూలు జిల్లాలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బహుశా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా బైరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్పూర్తినిచ్చారేమో? నిజానికి బైరెడ్డి ఒక విధంగా రాజకీయ నిరుద్యోగనే చెప్పాలి. నందికొట్కూరు నియోకవర్గానికి చాలా కాలం క్రితమే ఎంఎల్ఏగా పనిచేసిన బైరెడ్డి ముందు కాంగ్రెస్ లోనే ఉండేవారు. తర్వాత మారిన పరిస్ధితుల్లో టిడిపిలో చేరారు. మళ్ళీ అక్కడి నుండి కూడా వచ్చేశారు.
ఉనికి కోసమే పార్టీ
తర్వాత ఏ పార్టీలో చేరకుండా రాయలసీమ జలాల కోసం ఉద్యమ సంస్ధను ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు కాస్త హడావుడి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ హడావుడి కూడా తగ్గించేశారు. త్వరలో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకనే ఇపుడు యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక పార్టీలో చేరి జిల్లాలో తన ఉనికిని చాటాలని ఉబలాటపడుతున్నారు.
ఎవరితోనూ ఎక్కువ కాలం పడదు
అనుకున్నదే తడవుగా తెలుగుదేశంపార్టీలో ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడుతో భేటీ కూడా అయ్యారు. త్వరలో టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు కూడా. కానీ ఎందువల్లో జాప్యం జరిగింది. చివరకు తెలుగుదేశంపార్టీలో చేరటం కుదరలేదు. ఆయనకు జిల్లా టిడిపిలో శతృవులు ఎక్కువ మందే ఉన్నారు లేండి. వాళ్ళెవరూ ఒప్పుకుని ఉండరు. సరే, తర్వాత ఎటూ ఉంది కదా అని వైసిపిలో ప్రయత్నాలు చేశారు. అక్కడా సేమ్ సీన్ రిపీటయ్యింది. దాంతో బైరెడ్డి అక్కడ కూడా డోర్లు క్లోజ్ అయిపోయాయి. విషయం ఏమిటంటే బైరెడ్డికి ఎవరితోనూ ఎక్కువ కాలం పడదు. ఒక విధంగా చెప్పాలంటే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకం.
కాంగ్రెస్ కండువానే దిక్కైంది
దాంతో చివరి ప్రయత్నంగా బిజెపిలో ట్రై చేశారు. జిల్లాలోని బిజెపి నేతలతో మంతనాలు కూడా జరిగాయి. ఏమైందో తెలీదు కానీ హటాత్తుగా ఈరోజు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక టిక్కెట్టు ఖాయమై ఉంటుంది. అందుకనే ఆలస్యమైతే కష్టమని వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. మొత్తానికి బైరెడ్డికి కూడా ఒక పార్టీ దొరికింది.