ఏ విషయంపైన కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ స్ధిర అభిప్రాయం ఉన్నట్లు లేదు. ఏదైనా ఓ విషయంపై తన అభిప్రాయం చెప్పాల్సొచ్చినపుడు కమిటీలని, నిపుణులని చెప్పి విషయాన్ని దాట వేయటం పవన్ కు మామూలైపోయింది. ఇదంతా ఇపుడెందుకంటే ? కాపుల రిజర్వేషన్ అంశం రాజకీయాలను ఎంతగా హీటెక్కిస్తోందో అందరికీ తెలిసిందే. మరి స్వయానా కాపు సామాజికవర్గానికే చెందిన పవన్ తన అభిప్రాయాన్ని చెప్పకపోతే ఎలా ?
నివేదిక తర్వాత అభిప్రాయం
అదే విషయమై పవన్ తాజాగా మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై న్యాయ, రాజ్యాంగ, మేధావులతో కూడిన కమిటీని వేయబోతున్నట్లు చెప్పారు. అంటే సదరు కమిటీ ఏర్పాటైన తర్వాత సమస్యపై అధ్యయనం చేస్తుందన్నమాట. ఆ తర్వాత తన నివేదికను పవన్ కు ఇస్తే దాన్ని మళ్ళీ పవన్ అధ్యయనం చేసి ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెబుతారట. ఇప్పటికే అర్ధమైఉంటుంది సమస్యపై పవన్ కు ఎంత క్లారిటీ ఉందో.
విషయం నాన్చటమే ఉద్దేశ్యమా ?
ఇక్కడ పవన్ ఒక విషయం మరచిపోయినట్లున్నారు. కమిటీ తన నివేదకను ఇచ్చి, దాన్ని పవన్ అధ్యయనం చేసి తన అభిప్రాయం చెప్పేలోగా ఎన్నికలు అయిపోవటం ఖాయం. అంటే పవన్ ఉద్దేశ్యం కూడా విషయాన్ని నాన్చటమే అయ్యుంటుంది. అందుకనే సమస్యపై విచిత్రంగా ఉంటుంది. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. తాజాగా వైసిపి అధ్యక్షుడు జగన్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. చిరవకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్యూపై ఓపెన్ అయిపోయింది. అయినా పవన్ మాత్రం వెనకాడుతూనే ఉన్నారు.
కాపులు, బిసిలే లక్ష్యమా ?
మిగిలిన పార్టీల అధినేతల ల్లాగ తన అభిప్రాయాన్ని చెబితే ఇటు కాపులు అటు బిసిలు కూడా దూరమవుతారన్న ఆందోళన పవన్ లో కనబడుతోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలపైనే ఆధారపడినట్లు కనబడుతోంది. ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో కాపుల ప్రాభల్యం ఎక్కువ. అలాగే ఉత్తరాంధ్రలోని 34 స్ధానాల్లో బిసిల ఆధిపత్యం ఎక్కువ. అందుకే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకుండా నాన్చుతున్నట్లు అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మరి, పవన్ ను ఏ వర్గం ఆధరిస్తుందో చూడాల్సిందే.