ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్, ఆయనకు చెందిన సాక్షి మీడియా రెండూ కనిపించవని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు.  రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరనేది నిర్ణయించేది టీడీపీనే అని అన్నారు. అమరావతిలో మాట్లాడిన మంత్రి తాజా రాజకీయాలు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ తీరుపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడేది బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమేనంటున్నారు యనమల. 

కేవలం తన దుష్ప్రచారం కోసమే జగన్ సాక్షి మీడియాను నెలకొల్పారని చెప్పారు. అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను సాక్షి మించిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2104లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న మంత్రి.. కేంద్రం మోసం చేయడంతోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చామన్నారు. కానీ తన  దుష్ప్రచారాలతో ప్రజల్లో అపోహలను సృష్టిద్దామనుకుంటున్న జగన్ కుట్రలు ఫలించబోవని యనమల అన్నారు.

బీజేపీ, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరిగింది జగన్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.   ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీ పంచన చేరిన జగన్ కు... టీడీపీని, చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కూడా లేదని అన్నారు. 2019లో టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు యనమల.

ఈ విషయం తెలిసే వైసీపీ అధినేత జగన్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పంచన చేరాల్సిన అవసరం టీడీపీకి లేదని.. జగనే కేసులకు భయపడి బీజేపీ పంచన చేరారని విమర్శించారు.ఎవరి పంచనో చేరాల్సిన దుస్థితి టీడీపీకి లేదని చెప్పారు. ఇప్పటికైనా జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ప్రెస్ కౌన్సిల్ దృష్టి సారించాలని కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: