ఉండటానికి దేశంలో భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఏదో ఉనికిని మాత్రమే చాటుకుంటోంది. బాబ్రి మసీదు కూల్చివేత తర్వాతే దేశవ్యాప్తంగా బిజెపికి ఆదరణ మొదలైంది. అప్పట్లో కూడా ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం పోవటం మామూలైపోయింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గ్రాఫ్ పెరిగినట్లుగా పెరగటం మాత్రం నరేంద్రమోడి ప్రధాన మంత్రి అయిన తర్వాత మాత్రమే అనే చెప్పాలి.
ఎప్పుడైతే మోడి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే తనకు అత్యంత నమ్మకస్తుడు, ప్రధాన మద్దతుదారుడైన అమిత్ షా ను పార్టీకి జాతీయ అధ్యక్షునిగా నియమించారు. దాంతో ఈ ధ్వయం దేశంలో జైత్రయాత్రను ప్రారంభించింది. సంప్రదాయబద్దంగా ఓట్లు వేయించుకోవటం, మెజారిటీ వస్తేనే అధికారం చేపట్టాలన్న పాతకాలపు పద్దతులకు ఈ ధ్వయం స్వస్తి పలికింది. నయానో భయానో ప్రత్యర్ధులను దారికి తెచ్చుకోవటం, అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయినా సరే అధికారంలోకి మాత్రం బిజెపినే రావాలన్న లక్ష్యంతోనే వీరిద్దరు పనిచేస్తున్నారు. అందుకే ఇపుడు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది.
ప్రధానిగా బాధ్యతలు తీసుకోగానే ముందుగా మోడి చేసిందేమిటంటే పార్టీలోని వృద్ధతరం నేతలను పక్కనపెట్టేయటం. యువకులను ముందుకు తెచ్చారు. మోడి పద్దతి దీర్ఘకాలంలో పార్టీకి మంచి చేస్తుందా లేకపోతే కీడు చేస్తుందా అన్నది వేరే సంగతి. ఇప్పటికైతే పార్టీ గ్రాఫ్ ను ఉచ్ఛస్ధితికి తీసుకెళ్ళారన్నది మాత్రం వాస్తవం. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. మొన్న కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినట్లే ఏర్పడి మళ్ళీ పడిపోయింది. అందుకే బిజెపిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటానికి తెరవెనుక ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటరనటంలో సందేహం లేదు. కాకపోతే కాలం కలిసి రావాలంతే. ఈ స్ధాయిలో కమలవికాసం కేవలం మోడి రాజనీతి వల్లే సాధ్యమైందని చెప్పటంలో సందేహమే అవసరం లేదు.