చంద్ర బాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ లో సీబీఐ కు ప్రవేశం లేదని ఉత్తర్వలు జారీ చేయడం ఇప్పడూ అందరికీ నవ్వు తెప్పిస్తుంది. సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ అనీ.. ఏదన్నా కేసు విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు వెళ్ళినప్పుడు, ఆ ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తుందనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీబీఐకి అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ప్రస్తావనకే రాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదన్నా కేసు విచారణకు సంబంధించి హైకోర్టు గనుక, సీబీఐని రంగంలోకి దించితే, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏమీ వుండదన్నది వారి వాదన.
మాజీఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అయితే, ప్రభుత్వం జారీ చేసిన జీవోని చెత్త కాగితంగా అభివర్ణించేశారు. చంద్రబాబు నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం ఇంత సిల్లీగా ఆలోచిస్తుందా.? అని ఆయన ఎద్దేవా చేశారు. రోజురోజుకీ చంద్రబాబులో అసహనం పెరిగిపోతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని ఉండవల్లి ప్రశ్నించారు. మరోపక్క, సుప్రీంకోర్టు న్యాయవాదులు సైతం చంద్రబాబు తీరుని ఆక్షేపిస్తున్నారు.
ఇదిలావుంటే, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని సమర్థించారట. సీబీఐకి, ఆంధ్రప్రదేశ్లో విచారణకు అనుమతి ఇవ్వకూడదని మమతా బెనర్జీ అంటున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కర్నాటకలోనూ ఇదే పద్ధతి అమల్లో వుందనీ, ఆంధ్రప్రదేశ్లో గత రెండు మూడు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని, జీవో జారీ చేశామని అసలు విషయం బయటపెట్టేశారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.