ఏపీలో ఏం జరుగుతోంది? - అవును ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. ఉన్నట్టుండి రాష్ట్రం మొత్తం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా `పొలిటికల్ ఎమర్జెన్సీ`ఏమైనా రాజ్యమేలుతోందా? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్విగ్నభరిత వాతావరణం ఏర్పడింది. అధికార పార్టీనేత చంద్రబాబు, విపక్షనాయకుడు జగన్ ఇద్దరూ కూడా అలెర్ట్ అయ్యారు. వారివారి విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకున్నా రు. అత్యంత కీలకమైన దావోస్ పర్యటనను చంద్రబాబు, తన కుమార్తెను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించిన జగన్ కూడా హఠాత్తుగా తమ ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ కాక పెరిగిపోయింది.
ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే చర్చలపై దృష్టి పెట్టారు. స్టేట్లో ఏమైనా పొలిటికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? అనే కోణంలోనూ చర్చ జరిగింది. నిజానికి ఎన్నికలకు మరో మూడు మాసాల గడువు ఉంది మార్చి చివరి వారంలో ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు దీనికి సంబంధించి చకచకా పావులు కదుపుతుం డడంతో జగన్ కూడా అలెర్ట్ అయ్యారా? అని కొందరు. లేదు.. అత్యంత కీలకమైన సమయంలో జగన్ అందుబాటులో లేకపోతే.. అభ్యర్తుల ఎంపికపై ప్రభావం పడడమే కాకుండా... వ్యతిరేక ప్రచారానికి కూడా కారణమవుతుందని జగన్ భావించారనే చర్చ సాగింది.
ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన రద్దు చేసుకోగా.. చంద్రబాబు పరిస్థితి చిత్రంగా అనిపిస్తోంది. ప్రతి ఏటా నిర్వహించే ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సులో ఆయన పాల్గొనేందుకు దావోస్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ దఫా వెళ్లకపోవడం వెనుక.. కేవలం అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు.. రాజకీయంగా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆయన ఆందోళన చెందుతుం డడమే కారణంగా కనిపిస్తోంది.
అసంతృప్తులకు జగన్ గేలం విసురుతుండడం ప్రధాన కారణంగా కనిపిస్తోందని అంటు న్నారు. ఇక, కేసీఆర్-జగన్లు భేటీ కానున్న నేపథ్యంలో రాజకీయంగా పెను కుదుపు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చంద్రబాబు భావిస్తుండడం కూడా మరో కారణం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరెన్ని మార్పులు చేర్పులు ఉంటాయో చూడాలి.