తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి అంటే...ఉండే వారు తక్కువ. పార్టీని వీడిపోయేవారు ఎక్కువ. పార్టీ నేతలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేగా పేరున్న సబితా ఇంద్రారెడ్డితో పాటుగా మొదటి సారి గెలిచిన హరిప్రియానాయక్ వంటి ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులుగా గుడ్బై చెప్పడం ఓవైపు...ఫైర్బ్రాండ్ నేతగా పేరున్న డీకే అరుణ వంటివారు సైతం తమ దారి తాము చూసుకుంటూ కాంగ్రెస్కు గుడ్బై చెప్తున్న తరుణంలో...పార్టీని పట్టుకొని ఉండిపోతోంది ఎవరంటే..రేవంత్ రెడ్డి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఇలాకా అయిన కొడంగల్లో ఓడిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా బరిలో దిగేందుకు ఓకే చెప్పారు. ఇలాంటి స్థితిలో వేరెవరైనా ఉంటే...నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసే వారు. కానీ రేవంత్ మొండిఘటం కదా. అందుకే పోటీకి ఓకే చెప్పేశారు. బరిలో ఉంటానని, అసలు పార్టీ ఇలాంటి స్థితిలో ఉన్నపుడే నేతలు కార్యకర్తలో స్థైర్యం నింపేందుకు కృషి చేయాలన్నాడు. తన బంధువులు అంతా కేసీఆర్ చుట్టూ ఉంటే, తాను మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
రేవంత్ రెడ్డి మొండి ధైర్యంతో బరిలో దిగుతుండటం, ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులను సీపీఐ, తెలంగాణ జనసమితి నేతలను కలవడం వంటి వాటితో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సైతం అలర్ట్ అయ్యారని అంటున్నారు. అందుకే అభ్యర్థిని ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మిగతా నియోజకవర్గాల కంటే శ్రద్ధ పెట్టేలా వ్యవహరించిన రేవంత్ రెడ్డి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఇంకొందరు అంటున్నారు.