కోడెల శివప్రసాదరావు. ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన రాజకీయా ల్లో ఉన్నారు. ఇక, రిటైర్మెంట్ కూడా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇంతలోనే కోడెల ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారికి అవినీతి ఆరోపణలు సహజం. అయితే, పెద్ద వాళ్లను లేదా పారిశ్రామిక వేత్తలను, లేదా ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి ఎంతో కొంత ఫండ్ తీసుకోవడం అనేది పాలిటిక్స్లో కామన్గా ఉండేదే. అయితే, కోడెల కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ, ఆయన కుమార్తె పూనాటి విజయలక్ష్మిల వ్యవహారానికి వస్తే.. మధ్యతరగతి వారిని, పేదలను బెదిరించి కోట్లు కూడబెట్టుకోవడం సంచలనంగా మారింది.
పేదలకు సేవ చేస్తామని, ప్రభుత్వ పలాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేసే రాజకీయ నాయుకుడి కుటుంబంలో ఆయన వారసుడు, వారసురాలు కూడా పేదల నోటి కాడ కూడు లాక్కోవడం, అధికారాన్ని వినియోగించి పేదలు, మధ్యతరగతి వారిపై దౌర్జన్యాలకు దిగడం వంటివి సంచలనంగా మారాయి. దాదాపు ఐదేళ్ల గత స్పీకర్ ప్రస్థానంలో తన కుమారుడు, కుమార్తెను రాజకీయాల్లోకితీసుకు రావాలని కోడెల భావించారు. కుదిరితే.. ఇద్దరికీ సత్తెనపల్లి, నరసరావు పేట టికెట్లను కూడా ఇప్పించుకుని, గెలిపించుకోవాలని అనుకున్నారు. అయితే, రాజకీయ సమీకరణల నేపథ్యంలో వీరికి టికెట్లు ఇవ్వడం కుదరలేదు.
కానీ, ఇంతలోనే వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫార్మాకంపెనీల నుంచి విజయ లక్ష్మి కమీషన్ల రూపంలో కోట్లు వసూళ్లు చేశారని ఆయన స్పీకర్గా ఉన్న సమయంలో నే ఆరోపణలు వచ్చాయి. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏకంగా బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తున్నారు. తమకు కోడెల ఫ్యామిలీ చేసిన అన్యాయాలను వారు చేసిన అక్రమాలను ఏకరువు పెడుతున్నారు. నిజానికి ఇప్పుడు వెలుగు చూస్తున్న అక్రమాలు కేవలం కొన్నేనని, ఈ ఇద్దరు కోడెల వారసులు చేసిన అకృత్యాలు, ఆగడాలకు హద్దేలేదని అంటున్నారు గుంటూరు జిల్లా రాజకీయ పరిశీలకులు. కోడెల ఫ్యామిలీ దోపిడీలతో సినిమా తీస్తే అంతులేని దోపిడీ టైటిల్ అయితే కరెక్టుగా మ్యాచ్ అవుతుందన్న సెటైర్లు కూడా సోషల్ మీడియాలో పడుతున్నాయి. వీరిపై లోతైన విచారణ జరిగితే.,. మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల ప్యామిలీ అన్యాయాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.