ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న క్రికెట్ వరల్డ్ కప్లో ఊహించని కలకలం మరోమారు చోటుచేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్లో కాశ్మీర్ వివాదం తెరమీదకు వచ్చింది. ఏకంగా గ్రౌండ్లనే...నినాదాల కలకలం మొదలైంది. జూన్ 29న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ‘జస్టిస్ ఫర్ బలోచిస్థాన్’ అనే నినాదంతో స్టేడియంపై విమానం వెళ్లిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే రీతిలో... భారత్-శ్రీలంక మ్యాచ్ మధ్యలో ‘జస్టిస్ ఫర్ కశ్మీర్’ అనే స్టోగన్ గల బ్యానర్తో ఒక విమానం స్టేడియం మీదుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
లీడ్స్లో భారత్, శ్రీలంకల మధ్య మ్యాచ్ జరుగుతుండగా 'జస్టిస్ ఫర్ కశ్మీర్' అనే బ్యానర్తో ఓ విమానం స్టేడియం మీదుగా వెళ్లింది. ప్రపంచకప్ టోర్నీ మొదలైనప్పటి నుంచీ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. వీటిపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఐసీసీ స్పందించింది. ప్రపంచకప్ టోర్నీల వద్ద ఇలాంటి రాజకీయ సందేశాల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. తాజా ఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయించింది.
ఇదిలాఉండగా, వరల్డ్కప్ సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసింది. చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్ ఇవాళ శ్రీలంకను ఢీకొంటుంది. మరోవైపు పేరుకు తగ్గట్లు రాణించలేకపోయిన లంకేయులు చివరి మ్యాచ్లోనైనా నెగ్గి విజయంతో టోర్నీ ముగించాలని ఆశతో ఉన్నారు.ప్రస్తుతం 13 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న టీమ్ఇండియా లంకను ఓడిస్తే 15 పాయింట్లతో టాప్కు చేరుతుంది. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా నెగ్గితే మన స్థానంలో మార్పు లేకుండా కివీస్తో తలపడొచ్చు. ఒకవేళ ఆసీస్ నెగ్గితే.. సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్తో భారత తలపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మ్యాచ్ ఫలితం మన చేతిలో లేదు కాబట్టి చివరి మ్యాచ్లో నెగ్గి టాప్ కు వెళ్లాలని భారత్ పట్టుదలగా ఉంది.