అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో భారత్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు. భారత్ డ్రగ్స్ సరఫరాలో పేరెన్నికగన్న దేశంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సరఫరా చేసే 20 ప్రధాన దేశాల సరసన ఇండియాను కూడా చేర్చారు. ఈ మేరకు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియోకు నివేదిక సమర్పించారు.
అమెరికాను ముంచెత్తుతున్న డ్రగ్స్ విషయంలో తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తిప్పికొట్టడంలో పురోగతి సాధిస్తున్నాం. ఇంకా సాధించాల్సిన అవసరముందన్నారు. 2019లో 68వేల 557 డ్రగ్ డెత్ కేసులు నమోదయ్యాయని..2018 కంటే ఇవి ఎక్కువన్నారు. బహమాస్, బొలీవియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, పనామా, మెక్సికో, గ్వాటెమాలా, పెరూ, జమైకా, వెనిజులా ఇలాంటి 20 దేశాల్లో భారత్ కూడా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కౌంటర్ మాదక ద్రవ్యాల ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో బొలీవియా, వెనిజులా విఫలమయ్యాయని తెలిపారు.
కొలంబియాలో కోకా, కొకైన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని..దాన్ని అరికట్టేందుకు ఆ దేశంతో కలసి పనిచేస్తామన్నారు. 2023 చివరి నాటికి కోకా, కొకైన్ ల ఉత్పత్తిని సగానికి తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రాణాంతక డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని..ఇందుకు మెక్సికో సహకారం అవసరమన్నారు. యూఎస్ లోకి ప్రవేశించే ప్రాణాంతక డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ఇంకా చర్యలు తీసుకోవలసిన అవసరముందన్నారు. కొలంబియా,వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశ సరిహద్దులను బలోపేతం చేయడం, అక్రమ మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి చాలా నిధులు కేటాయించిందని తెలిపారు. కాగా, ట్రంప్ మన దేశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.