మాములుగా ఒక మనిషి రోజుకు 8 గంటలు పనిచేస్తారు. మహా అంటే మరో రెండు గంటలు చెయ్యొచ్చు. అంతకు మించి చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. సమతుల్యత లోపిస్తుంది. దీంతో ఇబ్బదులు తలెత్తుతాయి. రోజుకు 16 గంటలు పనిచేయడం అంటే అతను మనిషి కాదు మోడీ అని చెప్పాలి. ఎందుకంటే రోజులో అయన 18 నుంచి 20 గంటలు పనిచేస్తారు. తన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నారు. అదే ఫిబ్రవరి 14 వ తేదీన. ఆ ఒక్కరోజు సెలవు తీసుకోవడం వలన దేశంలో భారీ నష్టం జరిగింది. పుల్వామా దాడి జరిగింది. ఇది వేరే విషయం అనుకోండి.
అసలు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా ముంబై నగరాన్ని వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. రవాణా స్తంభించిపోయింది. జనజీవనం ఆగిపోయింది. ఎవరూ బయటకు రావడం లేదు. మెట్రో రైల్ సర్వీసులు నిలిచిపోయాయి. కారణం ట్రైన్ ట్రాక్ లపై నీళ్లు రావడమే. ముంబై మెట్రో ఆగిపోయింది అంటే కోట్లాది మంది ఇబ్బందులు పడతారు. నిత్యం ఆ ట్రైన్స్ లో లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఆఫీస్ లకు, గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో ఒక సాధనం. అలాంటి మెట్రో నిలిచిపోతే ఇంకేమైనా ఉన్నదా.
మెట్రో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి ట్రాక్ ఇంజనీర్ హరీష్ కుమార్ రాధోడ్ తన స్టాఫ్ తో కలిసి రంగంలోకి దిగాడు.. అంధేరి.. వాసై ప్రాంతాల మధ్య ట్రాక్ పై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు నడుంబిగించారు. ఇంజనీర్ నాన్ స్టాప్ గా 16 గంటలు పనిచేసి.. ట్రాక్ పై ఉన్న నీళ్లను బయటకు పంపేశారు..కొట్టుకుపోయిన కంకరను సరిచేశారు. 16 గంటల తరువాత ట్రాక్ రెడీ అయ్యింది.
ట్రాక్ రెడీ అయినట్టు స్టేషన్ కు మెసేజ్ చేశారు. రైళ్లు ఆ ట్రాక్ పై పరుగులు తీశాయి. హరీష్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి, చేసిన సాహసానికి, చేపట్టిన 16 గంటల మిషన్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఈ విషయం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు తెలిసింది. వెంటనే గోయల్ ట్విట్టర్ ద్వారా హరీష్ కుమార్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అంకిత భావంతో పనిచేస్తే వర్షాలు ఏవి చేయలేవని, నాకెందుకులే అని కూర్చోకుండా, కూర్చొని ఆర్డర్లు వేయకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తే అంతా సవ్యంగా జరుగుతుందని అన్నారు పీయూష్ గోయల్. నెటిజన్లు కూడా ఇంజనీర్ హరీష్ కుమార్ ను మెచ్చుకుంటున్నారు.