ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలో సమ్మె చేస్తున్నారు. వారి ప్రధాన వాదన ఒక్కటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇదే ప్రధానమైన డిమాండ్. జీతాలను అడగటం లేదు. జీవితాంతం పనిచేస్తున్న సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలని కోరుకుంటున్నారు. దీని వలన ఆర్టీసీ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని అంటున్నారు. కానీ, ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉన్నది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు అధిక జీతాలు ఇస్తున్నామని, ఇంకా ఎక్కువ జీతాలు ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు.
కార్మికులు మాత్రం తాము జీతాలు అడగడం లేదని, ప్రభుత్వంలో విలీనం చేయమని అంటున్నారు. పక్క రాష్ట్రంలో సాధ్యమైనపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. ఇక పక్కరాష్ట్రంలో ఏపీ కార్మిక సంఘాలు తెలంగాణ కార్మిక సంఘాలకు మద్దతు తెలిపాయి. ఇది తెరాస ప్రభుత్వానికి ఒకింత కష్టమైన విషయంగానే చెప్పాలి. అంతేకాదు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సకలజన సమ్మెలో పోరాటం చేసిన వ్యక్తుల్లో హరీష్ రావు,
శ్రీనివాస్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారని వారంతా తెలంగాణ సకలజన సమ్మెలో పోరాటం చేశారని, కెసిఆర్ ఆ ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు.
ఇప్పటి వరకు తెరాస ప్రభుత్వం సెంటిమెంట్ ప్రాతిపదికన గెలుస్తూ వస్తున్నది. అటు కేటీఆర్ తనదైన ముద్రను వెనుకుంటు వస్తున్నాడు. కానీ, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ డిమాండ్లు ఫలించకపోతే.. చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం నడిచింది.
ఇప్పుడు ఇక్కడ కూడా మరలా పోరాటాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు టిడిపి పావులు కదుపుతున్న తరుణంలో ఇది ఆ పార్టీకి సువర్ణావకాశం అని చెప్పొచ్చు. టిడిపి కార్మిక సంఘాలకు ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి. బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే జనసేన పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తుందా లేదంటే.. ఎప్పటిలా సైలెంట్ గా ఉంటుందా చూడాలి.