రాజకీయాన్ని ఊసరవెల్లితో పోలుస్తారు. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఏ నాయకుడు ఎప్పుడు రంగులు మారుస్తాడో తెలియదు. ఎవరు గెలిచి పదవిలోకి వస్తారో అసలే అర్ధం కాదు. ఇలాంటి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం రావడం. అందులో టికెట్ కన్ఫాం అవ్వడం చాల ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి అదృష్టమే ఓ టిక్టాక్ స్టార్కు దక్కింది. ఇకపోతే టిక్ టాక్ చాలా మందిని ఓవర్ నైట్ స్టార్లను చేయడమే కాకుండా రాజకీయ నాయకులను కూడా చేస్తుందని ఇప్పుడు ఈ సంఘటంతో ఋజువైయ్యింది. ఆ స్టార్ హరియాణకు చెందిన సొనాలీ. ఈ టిక్ టాక్ స్టార్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనుంది.
అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను బీజేపీ సొనాలీకి కేటాయించింది. ఇక ఈమె హర్యానా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలే టిక్టాక్ స్టారు అందులో ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏది మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతోంది. తాజాగా ఆమె ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అదే నినాదాన్ని సభకు వచ్చిన ప్రజలను కూడా చేయాలని కోరారు. అయితే అక్కడున్న కొందరు యువకుల నుండి స్పందన రాలేదు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, మీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా అంటూ ప్రశ్నించడం గమనార్హం. అంతే కాకుండా ఆ నినాదం చేయని వారి ఓటుకి అసలు విలువ లేదు అంటూ, మీరు భారతీయులైతే భారత్ మాతా కి జై అని చెప్పండి" అని కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఇకపోతే అక్టోబర్ 21వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయిపై ఆమె ఆడంపూర్లో పోటీ చేస్తున్నారు. ఇకపోతే ఈ నియోజక వర్గం నుంచి హరియాణ మాజీ సీఎం భజన్ లాల్ 2000 ,2005 ఎన్నికల్లో గెలుపొందారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో భజన్ లాల్కు చెందిన కుటుంబం సభ్యులే గెలుపొందారు. దీంతో బీజేపీ అందపూర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా టిక్ టాక్ స్టార్కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అదంపూర్ అసెంబ్లీ ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చివరికి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి...