అతడో దేశ ముదురు. మంత్రి పీఏనని, ఎంపీ బంధువని చెప్పుకుంటూ.. కోట్ల రూపాయలకు టోకరా వేసిన కిలాడీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘరానా మోసగాడిపై కేసులున్నాయి. ఛీటింగ్, కిడ్నాప్, అత్యాచారం, హత్య..ఇలా అన్ని రకాల క్రైం రికార్డ్ ఉంది. చివరికి పాపం పండి పోలీసులకు బుక్కయ్యాడు.
మంత్రులు, అధికారుల పేరుతో జనం నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం ఈదూరుకు చెందిన గుండాల వంశీ కృష్ణారెడ్డి... ప్రస్తుతం వేదాయపాలెంలో నివసిస్తున్నాడు. మైనింగ్ లీజులు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువుర్ని ఇతగాడు మోసం చేశాడు. ఐటీ మంత్రి గౌతం రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మనోహర్ రెడ్డి ఫిర్యాదు మేరకు వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు పోలీసులు. దీంతో తాను చేసిన మోసాల చిట్టా బయటపెట్టాడీ కిలాడీ. అతను చేసిన ఛీటింగ్స్ చిట్టా విన్నాక పోలీసులే విస్తుపోయారు.
అబద్దపు హామీలతో పలువురి నుంచి డబ్బు వసూలు చేయడమే కాదు... దొంగతనాలు, ఆఖరికి హత్యలు, అత్యాచార కేసులతో కూడా వంశీకృష్ణారెడ్డికి సంబంధం ఉంది. నాయుడుపేటలో గతంలో ఒకరిమీద ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. నోట్ల మార్పిడి సమయంలో 23 లక్షల రూపాయలకు టోకరా వేసిన కేసులో గూడూరు పీఎస్ లో అరెస్టయ్యాడు ఈ వంశీకృష్ణ. 2015లో ఢిల్లీకి చెందిన యువతి పై అత్యాచారం చేసిన కేసులో తెలంగాణలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. డబ్బుల వ్యవహారంలో హర్షవర్ధన్ అనే వ్యక్తిని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన కేసులోనూ ఇతరు దోషే. అంతేకాదు...వంశీ కృష్ణారెడ్డి తప్పుడు చిరునామాలతో ఆధార్ కార్డు సృష్టించి ప్రజలను మోసం చేసాడు. తాజాగా విశాఖపట్నంలో రాజు అనే వ్యక్తికి గనులు ఇప్పిస్తానని 40 లక్షలకు మోసం చేసిన కేసు నమోదైంది.
ఇంతేకాదు..వంశీ మోసాల చిట్టా ఇంకా ఉంది. ఆర్ఓ ప్లాంట్ ఇప్పిస్తారని మరో వ్యక్తితో 35 లక్షలు, వినాయక చవితి సందర్బంగా బాలాపూర్ గణేష్ లడ్డు విషయంలో కూడా ఓ వ్యక్తి నుంచి 25 లక్షలు తీసుకొని మోసం చేశాడు. ఈ విషయాలన్ని మంత్రి దృష్టికి రావడం. పోలీసులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది.