కరోనా మహమ్మారిని ఎలాగైనా తరిమికొట్టాలని ఒకొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడినవాళ్ళు చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి అంటుకునే వ్యాధి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 16 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా విలయాన్ని ఎలాగైనా ఆపాలని గుజరాత్లో ఓ వ్యక్తి మూఢనమ్మకాలకుపోయి దారుణానికి పాల్పడ్డాడు. అదేమిటంటే వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ కి చెందిన వివేక్ శర్మ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ నుంచి బతుకుతెరువు కోసం గుజరాత్లోని బనస్కాంత జిల్లాకు వచ్చాడు.
జిల్లాలోని సుయ్గామ్ తాలుకాలో నాదేశ్వరి ప్రాంతంలో ఉన్న భవానీ మాత ఆలయంలో శిల్పాలు చెక్కే పని చేసుకుంటూ ఉండేవాడు శర్మ. గత రెండునెలలుగా తను ఈ పని చేస్తున్నాడు. ఇటీవల కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం పై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాంతో కాళీకా మాత భక్తుడైన వివేక్.. తన నాలుకను బలిస్తే ఈ మహమ్మారి ఉధృతి తగ్గుతుందని తనకు తానుగా భావించాడు. రెండురోజుల కిందట ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిన వివేక్.. తన నాలుకను కోసుకున్నాడు.
వివేక రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో... వారి కుటుంబ సభ్యులంతా వివేక్ కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. అతని సోదరుడు ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాలుకను తిరిగి అతికించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలకు విలువ ఇస్తున్న వారిని చూస్తుంటే జాలేస్తుందనే చెప్పాలి. కరోనా వ్యాధి వల్ల పెద్ద పెద్ద పుణ్య క్షేత్రాల్లోనే పూజలు, పండగలు అన్నీ నిలిచిపోయాయి. మరి ఇలాంటివన్నీ మనల్ని కాపాడతాయని వివేక్ శర్మ ఎలా నమ్మాడో ఏంటో.