దేశానికి తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా రికార్డు సృష్టించిన కపిల్దేవ్.. అనారోగ్యం పాలయ్యాడు. ఛాతినొప్పి రావడంతో ఈ మాజీ క్రికెటర్.. ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
చాతినొప్పి రావడంతో.. గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరాడు కపిల్దేవ్. వెంటనే యాంజీయోప్లాస్టీ చికిత్స చేసిన వైద్యులు.. ఐసీయూలో ఉంచారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ చేయనున్నట్టు తెలిపారు. కపిల్ ఆరోగ్య పరిస్థితిపై ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా స్పందించారు. ప్రస్తుతం కపిల్ పరిస్థితి బాగుందని.. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడామనీ చెప్పారు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది వదంతులు మాత్రమేనన్నారు.
కపిల్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మదన్లాల్.. కపిల్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.
1983 ప్రపంచకప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన భారతజట్టును విశ్వవిజేతగా నిలపడంలో ఈ హరియాణా హరికేన్.. కీలక పాత్ర పోషించాడు. 61 ఏళ్ల కపిల్దేవ్ భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5వేల 248 పరుగులు చేసిన కపిల్ 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3వేల 783 పరుగులు చేసి.. 253 వికెట్లు సాధించాడు. మొత్తం కెరీర్లో సూపర్ ఆల్రౌండర్గా అలరించాడు. మొత్తానికి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.