విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు పరం చేయాలనుకుంటోంది. ఈ విషయం బహిరంగంగానే చెప్పింది. ఇందుకు కారణం కూడా చెప్పింది.. విశాఖ ఉక్కు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. అందుకే ప్రైవేటు చేస్తున్నామని చెప్పింది. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానికి లేఖరాసిన ఏపీ సీఎం జగన్.. నిన్న  విశాఖ వెళ్లారు. అక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అదే సమయలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టే  ఐడియా చెప్పారు జగన్.

స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉన్నాయి.. వాటిలో స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగించని భూమి కనీసం 7 వేల ఎకరాలు ఉంటుందని అంచనా. ఆ భూమిని వాణజ్యంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు అనుమతి ఇస్తామంటున్నారు జగన్. ఆ భూమిని ప్లాట్లు, లేఅవుట్లు వేసి విశాఖ స్టీల్ పరిశ్రమ ద్వారానే అమ్మించాలని జగన్ అంటున్నారు. అలా అమ్మగా వచ్చిన డబ్బును స్టీల్‌ప్లాంట్‌లోనే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరిశ్రమలో ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయని.. ఇవన్నీ అమలైతే ప్రైవేటువారికి ఇవ్వాల్సిన అవసరం ఉండదని జగన్ అంటున్నారు.


అయితే.. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నుంచి కాపాడేందుకు ఆ సంస్థకు ఉన్న 7 వేల ఎకరాల భూమిని అమ్మాలన్న సీఎం జగన్ ప్రతిపాదనను ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తప్పుబట్టారు. భూములు అమ్మకం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదన్నారు. రేపు భవిష్యత్‌లో విశాఖ స్టీల్ పరిశ్రమ విస్తరించదలిస్తే.. అప్పుడు భూములు దొరకవని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గుర్తు చేశారు. భూమి అనేది పునరుత్పాదన చేయలేని వనరు అని ఆయన గుర్తు చేశారు.


స్టీల్ అవసరం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుందని.. భవిష్యత్ అవసరాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విస్తరించాల్సిన అవసరం వస్తుందని.. అప్పుడు భూములు ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. అసలు భూముల అమ్మకుండానే విశాఖను లాభదాయకం చేయవచ్చని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సూచించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడం లేదా.. సెయిల్ వంటి సంస్థలతో అనుసంధానిస్తే ప్రైవేటీకరణ సమస్యే ఉండదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: