చిత్తూరు జిల్లాలో అగ్రనేతలిద్దరి మధ్య రాజకీయం మరింత ముందురుతోంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు అన్న సంగతి తెలిసిందే. ఇదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి జగన్ కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. పెద్దిరెడ్డికీ చంద్రబాబు కు ఎప్పటి నుంచో రాజకీయ శత్రుత్వం ఉంది. తాజాగా కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై విమర్శల జోరు మరింత పెంచారు.

పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తర్వాత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి ఇంకాస్త డోస్ పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అంటున్నారు.  కుప్పంలో ఓటమితో చంద్రబాబులో అసహనం విపరీతంగా పెరిందని విమర్శించారు.

చంద్రబాబు కరోనా కష్టకాలంలో కూడా కుప్పం వైపు చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విమర్శించారు.  ఇప్పుడు కుప్పంలో ఓటమిపాలయ్యే సరికి ప్రజలు గుర్తుకు వచ్చారని మండిపడ్డారు. పులివెందుల, పుంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మిథున్‌రెడ్డిని అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  గుర్తు చేశారు.గతంలో చంద్రబాబు పథకాలు వాళ్ల అబ్బ సొత్తుతో అమలు చేశారా అని నిలదీశారు. సీఎం వైయస్‌ జగన్‌ పథకాల వల్లే రాష్ట్రమంతటా టీడీపీని ఓడించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తెలిపారు..

మరి చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సవాల్‌కు చంద్రబాబు సై అంటే.. చిత్తూరు రాజకీయాలే కాదు.. మొత్తం ఏపీ రాజకీయాలే వేడెక్కే అవకాశం ఉంది. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: