ఆధునిక కాలంలో ప్రతి దాని గురించి సర్వర్లు, కంప్యూటర్లపై ఆధారపడటం, ఆటోమేషన్ యుగంలో ఇప్పుడు యుద్ధాలు కూడా కంప్యూటర్లతోనే జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు హ్యాకింగ్ ఓ ఆయుధంగా మారుతోంది. ఇక ప్రపంచం ఆధిపత్యం కోసం కొన్నాళ్లుగా తపిస్తున్న చైనా.. ఈ హ్యాకింగ్ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఆ హ్యాకింగ్ టీమ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనా హ్యాకింగ్ కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైబర్ వార్ఫేర్ విభాగంలో ‘యూనిట్ 61398’ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో వేలాది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇదో ఉన్నత శ్రేణి హ్యాకింగ్ బృందం. అమెరికా వంటి దేశాలు కూడా దీనిపేరు చెబితే ఉలిక్కిపడతాయట. ఈ బృందంలో కొన్ని విభాగాలు పూర్తిగా భారత్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం భారత్లో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్.. ఇప్పడుు ని టీకా తయారీ సంస్థల డేటాను దొంగతనం ఈ యూనిట్ పనే అంటున్నారు.
చైనా సైన్యంలో ఉన్న ఈ ఏపీటీ 1 చైనా ప్రభుత్వ హ్యాకర్ బృందంగా చెబుతున్నారు. ఇది చైనాలోని పీఎల్ఏ సైబర్ విభాగానికి చెందింది. దీన్నే కామెంట్ క్రూ, కామెంట్ పాండా, జిఫ్89ఏ, బైజాటియన్ కాండోర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ బృందం హ్యాక్ చేయాలనుకునే కంపెనీ వెబ్సైట్ కామెంట్ల సెక్షన్లో ఏదో ఒకటి పోస్టు చేస్తుంది. దానికి సదరు కంపెనీ సిబ్బంది సమాధానం ఇస్తే.. వారి ఐపీ అడ్రస్ను గుర్తించి దానిని హ్యాక్ చేస్తుంది. అందుకే దీనిని కామెంట్ క్రూ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ యూనిట్ బారిన పడకుండా తమ వ్యవస్థలను రక్షించుకునేందుకు ప్రపంచ దేశాలు సొంత రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.