బుద్దా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరాలు ఒక వర్గంగా ఉంటే.... కేశినేని నాని, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్లు ఒక వర్గంగా ముందుకెళుతున్నారు. ఇటీవల వీరి మధ్య రచ్చ మరి తీవ్ర స్థాయికి వెళ్లింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మీడియా ముందుకొచ్చి మరీ తిట్టుకున్నారు. వీరి రచ్చ వల్ల గెలవాల్సిన కార్పొరేషన్ని కూడా చేజార్చుకున్నారు. ఈ ఓటమి తర్వాత టిడిపి నేతలు కాస్త సైలెంట్ అయ్యారు.
కాకపోతే వెరైటీగా ఒక వర్గం యాక్టివ్గా ఉంటే...మరొక వర్గం యాక్టివ్గా ఉండటం లేదు. ఆ మధ్య కేశినేని వర్గం బాగా యాక్టివ్గా పనిచేసింది. ముఖ్యంగా కేశినేని శ్వేత ప్రజల్లో తిరిగారు. కానీ ఈ మధ్య వారు సైలెంట్ అయిపోయారు. ఇటీవల బుద్దా, బోండాలు బాగా హడావిడి చేసేస్తున్నారు. బుద్దా, బోండాలు ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య సైలెంట్ వార్ ఇంకా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వీరి మధ్య విజయవాడ వెస్ట్ సీటు చిచ్చు చెలరేగుతుంది.
ఆ సీటు దక్కించుకోవాలని బుద్దా వర్గం గట్టిగానే ట్రై చేస్తుంది...అయితే బుద్దాకు లేదా నాగుల్ మీరాకు సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు ఆ సీటులో జలీల్ ఖాన్ ఉన్నారు. కానీ యాక్టివ్గా పనిచేయడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తన కుమార్తె షబానా సైతం అమెరికాకు వెళ్ళిపోయారు. దీంతో నియోజకవర్గాన్ని చూసుకునే నాథుడే లేరు. అందుకే ఆ సీటుపై బుద్దా వర్గం కన్ను పడింది.