అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోన్న చర్యలు, తీసుకుంటోన్న నిర్ణయాలతో ఆ పార్టీకి కాపులు, బ్రాహ్మణ వర్గాలు దూరమవుతాయన్న సందేహాలు అయితే వస్తున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ తరపున శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే ఈ కార్పొరేషన్కు ఇద్దరు చైర్మన్లను మార్చేశారు.
ఈ వర్గం ఎప్పుడూ గతంలో వైఎస్ ఇప్పుడు జగన్కు సపోర్ట్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీరంతా జగన్ తీరుపై మండి పడుతున్నారు. అసలు బ్రాహ్మణ సామాజికవర్గాన్ని వెనకబడిన తరగతుల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఈ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంతో అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక ఇటీవల పరిణామాల నేపథ్యంలో కాపులు కూడా క్రమ క్రమంగా వైసీపీ కి , జగన్ కు దూరమవుతోన్న పరిస్థితి ఉంది.
అటు పవన్ కళ్యాణ్ ను కాపు నేతలు, మంత్రులతో టార్గెట్ చేయిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల ఊసే లేదు. దీంతో కాపుల్లో కూడా ఆలోచన అయితే స్టార్ట్ అయ్యింది. గత ఎన్నికలలో వీరంతా జగన్కే సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు వీరు కూడా దూరం అవుతున్నారు. మరి జగన్ వీరిని మరింత దూరం చేసుకుంటారా ? పంథా మార్చుకుంటారా ? అన్నది చూడాలి.