ఎన్టీఆర్ కి భారత రత్న, ఇది కొత్త డిమాండ్ కాదు. అనాదిగా టీడీపీ నేతలు చేస్తున్న డిమాండే. కానీ టీడీపీ సమయానుకూలంగా మాత్రమే ఈ అస్త్రాన్ని బయటకు తీస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మాత్రమే ఆయనకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తారు టీడీపీ నేతలు. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. అంటే ఆ డిమాండ్ ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కానీ, దాని అమలు కోసం ఉద్యమం చేయడం కానీ, కనీసం కేంద్రంపై ఒత్తిడి తేవడం కానీ ఇవేవీ జరుగుతున్నట్టు మనకు అనిపించదు.

మళ్లీ ఇప్పుడెందుకీ చర్చ..
తాజాగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఎన్టీఆర్ భారత రత్న ప్రస్తావన వచ్చింది. ఈసారి కాస్త గట్టిగా భారత రత్న డిమాండ్ చేయాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చే వరకు కేంద్రంపై పోరాడతామన్నారు. అయితే ఈ పోరాటం ఎలా చేయాలనేది ఆయన దిశా నిర్దేశం చేయాల్సి ఉంది.

అప్పుడేం చేశారు..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ భారత రత్న డిమాండ్ వినిపిస్తూనే ఉంది. పోనీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంపై పోరాటం చేస్తామంటున్నారు, మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలోని ఎన్డీఏలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు అసలు ఏం చేశారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చేవారేమో కదా. అసలు ఎన్టీఆర్ కి భారత రత్న ఇస్తామనే హామీ అయినా ఇచ్చేవారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తేకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి తెస్తాం, ఉద్యమం చేస్తామంటే కేంద్రం వింటుందా. పోనీ కేంద్రం వినే అవకాశం ఏదయినా ఉందా అనేది తేలాల్సి ఉంది.

మొత్తానికి మరోసారి ఎన్టీఆర్ కి భారతరత్న అనే డిమాండ్ తెరపైకి తెచ్చి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ భారత రత్న అనే డిమాండ్ ని కేవలం సమయానుకూలంగా మాత్రమే తెరపైకి తెస్తుంటారనే విమర్శ కూడా ఉంది. అదే నిజమైతే పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరోసారి భారత రత్న అనే అంశంపై టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: