తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు సమాచారం తెలుస్తోంది. జనసేన పార్టీతో కటీఫ్ చెప్పి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పుడు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఒంటరి పోరుకు రెడీగా ఉండాలని జిల్లా నేతలకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రజా పోరు యాత్రలు చాలా గట్టిగా చెయ్యాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉంది రాష్ట్ర బీజేపీ.మరోవైపు 175 అసెంబ్లీ ఇంకా 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధులను కన్ఫర్మ్ చేసే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది.ఇక ఇప్పటికే లిస్ట్ ను ఫైనల్ చెయ్యమని ఢిల్లీ అధినాయకత్వం నుండి ఆదేశాలు కూడా అందాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 2,500 మంది ఆశావహులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు గాను సగటున 8మంది పోటీ పడుతున్నారు. అందువల్ల వాటిని పరిశీలించి.. అభ్యర్థులను వడబోసే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.


శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది. ఇంకా ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ముఖ్యనేతలు హజరు కాబోతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి.. ఆ లిస్ట్‌ను అధిష్టానానికి పంపే ఆలోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ.ఒంటరిగా వెళ్తే కాపు నినాదంతో వెళ్లాలని కమలం భావిస్తోంది. తెలంగాణలో బీసీ సీఎం లాగా ఏపీలో కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఆలోచనలో ఉంది బీజేపీ. టీడీపీలో కమ్మ, వైసీపీలో రెడ్డి ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది. పైగా ఈ రెండు కులాలే ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే కాపుల కలలు ఇప్పటి వరకు కలగానే మిగిలాయి. ఈ నేపథ్యంలో కాపు సీఎం నినాదంతో వెళ్తే.. రాష్ట్రంలో మొత్తం 20 శాతం ఉన్న కాపులు తమకు దగ్గరవుతారనే ఆలోచన చేస్తోంది బీజేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: