ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలని మళ్లీ జాబితా మార్చారు. పలు స్థానాలలో అభ్యర్థులను మార్చి వేరొకరికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికీ ఇంకా సుమారు 50 వర్గాలలో తిరుగుబాట్లు అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. సీట్లు ఖరారు అయినా సరే అది తుది నిర్ణయం కాదు అని.. టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. దీంతో టికెట్టు పొందిన అభ్యర్థులు కూడా ప్రచారం మొదలు పెట్టాలా లేదా అన్న సందేహంలో ఉన్నారు మరొకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా వీడని గందరగోళాలు కూటమికి తీవ్ర నష్టాన్ని మిగిల్చేలా కనిపిస్తున్నాయి.
ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో ఇప్పుడు అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బిజెపికి కేటాయించి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించారు.. కానీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదే అని అంటున్నారు.. మరొకవైపు బిజెపి శ్రీనివాస్ వర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. మరొకవైపు రఘురామకృష్ణరాజు కూడా టిడిపిలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది.. ఇకపోతే బిజెపి ఎన్నికల ఇన్చార్జి సిద్ధార్థ నాథ్ సింగ్ నరసాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశం లేదని సోమవారం తేల్చి చెప్పారు. మొత్తానికైతే కూటమిలో అసంతృప్తి ఛాయలు ఇంకా భగ్గుమంటున్నాయి. మరి ఈ గందరగోళం నుంచి కూటమి ఎప్పుడు బయట పడుతుందో చూడాలి..