- విశాఖ ఎంపీగా భార్య ఝాన్సీ, విజయనగరం ఎంపీ కూడా బంధువే..!
- విజయనగరంతో పాటు విశాఖ సిటీని ఆక్రమించేసిన వైనం..!
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
వైసీపీలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అందరి నేతల్లోనూ మంత్రి బొత్స సత్యనారాయణకు మించిన అదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఇటు వైసిపి అధినేత జగన్ .. అటు టిడిపి అధినేత చంద్రబాబు లాంటి వారికే కలిసి రాని లక్ బొత్సకు కలిసి వచ్చింది. ఆయన కుటుంబం నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదే చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు ఎన్నికల్లో ఉంటే.. జగన్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బొత్స కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీగా.. ముగ్గురు ఎమ్మెల్యేలుగా అందరూ వైసీపీ నుంచే బరిలో ఉండడం అంటే బొత్సది మామూలు లక్ కాదనే చెప్పాలి.
ప్రస్తుతం బొత్స మంత్రిగా ఉన్నారు. మరోసారి ఆయన చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక విజయనగరం ఎంపీగా బొత్సకు సమీప బంధువైన బెల్లాన చంద్రశేఖర్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ కి విశాఖపట్నం ఎంపీ సీటు దక్కింది. వాత్సవానికి వైసీపీలో విశాఖపట్నం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు ? ఇక్కడ ఎవరిని పోటీకి పెట్టాలి అని పెద్ద సమాలోచనలు జరిగాయి. ఉత్తరాంధ్రపై అందులోనూ విశాఖ నగరంపై మంచి పట్టు ఉన్న బొత్స అయితే తన భార్యకు సీటు ఇస్తే గెలిపించుకు వస్తారన్న నమ్మకంతో జగన్ ఝాన్సీకి విశాఖ ఎంపీ సీటు ఇచ్చారు.
ఆమె గతంలో రద్దయిన బొబ్బిలి ఆ తర్వాత విజయనగరం నుంచి కూడా పార్లమెంటుకు ప్రాధినిత్యం వహించారు. ఇక బొత్స మేనకోడలు భర్త అయినా బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి తన సిట్టింగ్ సీటు నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్నారు.ఇక బొత్స సోదరుడు బొత్స అప్పల నరసయ్య కూడా మరోసారి గజపతినగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇలా బొత్స ఫ్యామిలీలో ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తుంటే మరో ఇద్దరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఇక బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను ఇప్పటికే విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఉండడంతో పాటు విజయనగరం జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు. చీపురుపల్లిలో బొత్స ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ అంతా చిన్న శ్రీను చూస్తారు. మరి ఈ ఐదుగురిలో ఈ సారి ఎవరు గెలుస్తారు... ఎవరు ఓడతారు.. బొత్స ఫ్యామిలీ ప్యాక్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో ? చూడాలి.