- ఎమ్మెల్సీ జంగా సైకిలెక్కడంతో బీసీ ఓట్లకు చిల్లు
- ఐదేళ్లుగా కేడర్ను వీడని యరపతినేనికి ఈ సారి ఫుల్ స్వింగ్
( పల్నాడు - ఇండియా హెరాల్డ్ )
కొన్ని శతాబ్దాల క్రితం పల్నాటి యుద్ధం జరిగిందని మనం కథలు కథలుగా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆ యుద్ధం ఎంత తీవ్రంగా జరిగిందో ఇప్పుడు అదే పల్నాడు ముఖద్వారం అయిన గురజాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య అంతే తీవ్రమైన పోరు జరుగుతోంది. గురజాలకు కాసు స్థానికేతరుడు.. ఆయనది నరసారావుపేట. గత ఎన్నికల్లోనే ఆయనను గెలిపించినా లోకల్ కాకపోవడంతో ఇక్కడ ప్రజలను ఓన్ చేసుకోలేరు.. ఇక్కడ సుధీర్ఘకాలం ఉండేందుకు ఇష్టపడరేమో అన్న సందేహాలు నియోజకవర్గ ప్రజల్లో ఉండేవి. కాసు గెలిచినా ముందునుంచి జనాలు అనుకున్నదే నిజం చేశారు.
ఆయన తన ఆస్తులు పెంచుకోవడానికి, సంపాదించుకోవడానికి గురజాలను మార్గంగా చేసుకున్నారే తప్పా ఇక్కడ నియోజకవర్గానికి వెలగబెట్టిందేమి లేదన్న విమర్శలు వచ్చేశాయి. ఆయన లోకల్ కాదు.. ఇవ్వాళ కాకపోతే రేపైనా ఆయన నరసారావుపేటకు పోయే ఉద్దేశంలో ఉన్నాడు. అందుకే ఇక్కడ పనులు చేస్తే ఏంటి ? చేయకపోతే ఏంటన్న మనస్తత్వంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు అన్నీ మర్చిపోయి కలిసికట్టుగా పనిచేయడంతో వైసీపీ వేవ్లో గెలిచేశారు.
కాని ఇప్పుడా పరిస్థితి ఎంత మాత్రం లేదు. సొంత పార్టీ నేతలు.. ఇంకా చెప్పాలంటే ఆయన సొంత సామాజిక వర్గం రెడ్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెడ్లలో ఏదో ముగ్గురు, నలుగురు నేతలు మినహా ఎవ్వరిని ఆయన పట్టించుకోలేదు. ఇక వైసీపీకి బీసీల్లోనే రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తినే అణగదొక్కడంతో నియోజకవర్గంలో బీసీలు.. ఇంకా చెప్పాలంటే ఇక్కడ బలంగా ఉన్న యాదవులు అందరూ కాసు మహేష్ను ఓడించి నరసారావుపేటకు పంపేద్దామన్న కసితో ఉన్నారు.
గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి పోరాటం హోరాహోరీగానే ఉంటుంది. ఎవరు గెలిచినా మెజార్టీ తక్కువే. 1952లో నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో కాసు మహేష్రెడ్డికి వచ్చిన మెజారిటీనే ఎక్కువ. ఇక కాసుకు స్థానిక నేతల నుంచి మద్దతు పూర్తిగా కరువైంది. నియోజకవర్గం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో తెలంగాణ నుంచి అక్రమ మద్యం అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయని.. దీంతో పాటు మైనింగ్ దందాలు ఎమ్మెల్యేకు ప్రమేయాలు ఉన్నాయన్న విమర్శలు బాగా గురజాలలో వినిపిస్తున్నాయి. ప్రతి పనికి కాసు కమీషన్లు బాగా వసూళు చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చేశాయి.
ఇక యరపతినేని విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ప్రజలకు ఐదేళ్ల నుంచి కంటిన్యూగా అండగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గాన్ని, పార్టీ కేడర్ను ఆయన ఎప్పుడూ వదల్లేదు. ఇదే ఆయనకు బిగ్గెస్ట్ ఫ్లస్ పాయింట్. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న కమ్మ వారిలో సగానికి పైగా కాసుకు సపోర్ట్ చేశారు. ఇందుకు గ్రామస్థాయి రాజకీయాలే ప్రధాన కారణం. ఇది యరపతినేని ఎలాగోలా సెట్ చేసుకున్నారు. ఎంపీ లావు పార్టీ మారి టీడీపీ నుంచి పోటీ చేయడం కూడా ఆయనకు ప్లస్ కానుంది.
ఇక ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో కమ్మ వారిని కాసు బాగా ఇబ్బందులు పెట్టారన్న టాక్ ఉంది. ఈ సారి బీసీల్లో 80 %, కమ్మల్లో 80 %, ఇతర ఓపెన్ క్యాస్టుల్లో 80 % యరపతినేని వైపే ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కూడా రెడ్డి వర్గం నేతే పోటీలో ఉండడంతో ఆయన కూడా రెడ్డి, ముస్లింల్లో కొన్ని ఓట్లు చీల్చనున్నారు. ఇటు కాపులు కూడా జనసేన ప్రభావంతో యరపతినేనికి బాగా సపోర్ట్గా ఉన్నారు. ఏదేమైనా పల్నాటి యుద్ధంలో యరపతినేని జోరు స్పష్టంగా కనిపిస్తోంది.