వైసీపీ చేసిన అతి పెద్ద తప్పులు చాలానే ఉన్నా.. అన్నింటికీ మించి.. చీరాల నియోజకవర్గంలో చేసిన తప్పు.. ఆ పార్టీకి ఒక సీటును ఎన్నికలకు ముందే దూరం చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడి ఇంచార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు టికెట్ ఇవ్వుకుండా దూరం పెట్టడం ఒక తప్పయితే.. ఆయనను కనీసం పట్టించుకోకపోవడం మరో అతి పెద్ద తప్పని పరిశీలకులు చెబుతున్నారు. ఇది వైసీపీకి ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందిలో పడే పరిస్థితి వచ్చింది.
2019 ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే.. ఆయన ఓడిపోయారు. అయినా కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ.. ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం బలరాం కుమారుడు వెంకటేష్కు అవకాశం ఇచ్చారు. ఇది చాలా మంది హర్షించడం లేదు. సొంత పార్టీలోనే వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇక, జనం నాడిని చూసినా.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజల్లో పట్టును కోల్పోకుండా ఉన్న ఆమంచి విషయంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటే.. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ గెలిపించుకుని తీరేవారమని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గత రెండేళ్ల కిందటి నుంచే వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా పరుచూరుకు పంపించింది. అయితే.. అక్కవ వైసీపీ నేతల నుంచి సహకారం లేకపోవడంతో ఇప్పుడు.. చీరాలకు వచ్చారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారు. కానీ, అదే ఆమంచి వైసీపీలో ఉంటే.. గెలిచే సీటు ఇదే నని పార్టీ నాయకుల్లోనూ చర్చ సాగుతోంది. మొత్తానికి వైసీపీ చేసిన ప్రధాన తప్పుల్లో ఇది తొలిస్థానంలో ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.