ఆంధ్రాలో ఎన్నికల వేళ విపక్షాలు వారి వారి హామీలతో ప్రజల మనసులను దోచుకొని ఓటు బ్యాంకుని బాగా సంపాదించాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. ఇక ఏపీలో కరెంటు చార్జీల మోత ఏ రీతిన మోగుతుందో జనాలకి తెలియంది కాదు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ రేట్లతో సామాన్యుడు నిత్యం సతమతం అయిపోతున్నాడు. ఈ దశలో ఏపీ వాసులకి బోనస్ అన్నట్టు గత నెలలో వాడిన కరెంటుకి గాను తాజాగా మరలా ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిచాయి. దీంతో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని అంచనా వేస్తోన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తనదైన రీతిలో ప్రణాళికా బద్దంగా ఎన్నికల వేళ ప్రచారం షురూ చేస్తోంది.

విషయం ఏమిటంటే.. తాజాగా జరిగిన ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... "జగన్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలతో డబ్బులు అకౌంట్లలో వేస్తూనే, మరోవైపు మద్యంపై వచ్చే ఆదాయం రూపంలో వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇక ఇప్పుడు కొత్తగా విద్యుత్ చార్జీలను పెంచి ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసే పనిలో పడింది. అయితే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే వీరి మాదిరి కుటిల రాజకీయాలు చేయబోము. విద్యుత్ చార్జీల పెంపు అనే ఆలోచనే ఉండదు. అలాగే అందుబాటు ధరలలోనే నిత్యావసర వస్తువులు, వంటనూనె, పెట్రోలు మొదలగునవి అందుబాటులో ఉంచుతాం!" అని బల్ల గుద్ది మరీ ప్రమాణం చేశారు.

అయితే, ఈ విషయం గురించి తెలుసుకున్న విశ్లేషకులు అసలు ఆ పని బాబు వలన అయ్యేనా? అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు వాగ్దానాలే అని పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో కూడా ధరల విషయంలో ఇలాంటి అవకతవకలు జరగడం అందరికీ తెలిసిందే. ఇక విద్యుత్ ఛార్జీల పెంపుని వ్యతిరేకిస్తూ.. దశలవారీగా ప్రభుత్వంపై  పోరాటం చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు గతంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూవాడా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: