వైసిపి పథకాలను ప్రజలకు చేరవేయడంలో కొమ్మినేని ప్రథమ భూమిక పోషించారు

•జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన కొమ్మినేని శ్రీనివాసరావు

•వైసిపి పై నమ్మకంతో ఆ పార్టీలను కూడా వదిలేశారు.



ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ గా బాగా సుపరిచితులు.. తెలుగు జర్నలిస్ట్, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత కూడా.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులయ్యే నాటికి ఈయన సాక్షి టీవీలో కూడా పనిచేశారు .. ఇక అక్కడ లైవ్ షో తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈయన జీవిత విషయానికి వస్తే..  గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్లో కొమ్మినేని రామారావు,  జయలక్ష్మి దంపతులకు జన్మించిన ఈయన..  గన్నవరంలో పాఠశాల , కళాశాల విద్యను అభ్యసించి ఆ తర్వాత ఎం. కామ్ పూర్తి చేశారు. దాదాపు 33 సంవత్సరాల కాలంలో వివిధ వార్తా పత్రికలలో పని చేసి.. టీవీ చానల్స్ లో విలేకరిగా కూడా పనిచేశారు..

1978లో ఈనాడులో చేరిన ఈయన అక్కడ చేరకముందు కూడా అనేక పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి,  హైదరాబాదులో పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ పత్రికలలో వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.. సబ్ ఎడిటర్ గా,  రిపోర్టర్ గా,  చీఫ్ రిపోర్టర్ గా వివిధ స్థానాలలో సేవలు అందించి..  1986లో గోదావరి జిల్లాలో జరిగిన వరద బీభత్సం 1990లో లాథూర్ లో జరిగిన భయంకరమైన భూకంపం, అలాగే 1992లో తిరుపతిలో జరిగిన ఏఐసీసీ కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ మహానాడు వంటి కార్యక్రమాలలో పాత్రికేయుడిగా ముఖ్య పాత్ర పోషించారు.  అలాగే ఢిల్లీలో ఈనాడు బ్యూరో చీఫ్ గా కూడా పనిచేసిన ఈయన.. పార్లమెంటుపై టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు ఆ సంఘటనను వార్తాంశంగా కూడా చిత్రీకరించారు. అలాగే బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ వార్తను కూడా ప్రచురించి తద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక తర్వాత 2002లో ఆంధ్రజ్యోతిలో చేరిన ఈయన నాలుగున్నర ఏళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికకు బ్యూరో చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎన్ టీవీలో చేరారు. ఆ మేనేజ్మెంట్ లో వచ్చిన విభేదాల వల్ల కొద్ది నెలలకే ఆ ఛానల్ నుంచి తప్పుకొని టీవీ ఫైవ్ లో టెలివిజన్ ఛానల్ లో పొలిటికల్ ఎడిటర్ గా చేరి.. ఆ ఛానల్ కు సంపాదకునిగా కూడా పనిచేశారు. తర్వాత న్యూస్ స్కామ్ అనే కార్యక్రమాన్ని రూపొందించి చాలామంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేయడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది.. అందులో 2 1/2 ఏళ్లు పని చేసిన తర్వాత ఎన్ టీవీలో ప్రధాన సంపాదకునిగా కూడా పనిచేశారు. ఇక తర్వాత సాక్షిలో చేరి అక్కడ లైవ్ షో విత్ కేఎస్ఆర్ కార్యక్రమాన్ని రూపొందించి.. మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా పనిచేసిన ఈయన జనవరిలో ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించిన ఈయన కూడా రాజీనామా చేయడం మరింత ఆశ్చర్యంగా మారింది.


ఇక వైసిపి పార్టీకి ఈయన ఎంతలా సహాయపడ్డారు అంటే ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన స్పష్టం చేశారు.  అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అభివృద్ధిని ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి.. ప్రజలకు మీడియా ద్వారా వివరించారు.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాని కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేసి వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి జగన్ ప్రభుత్వానికి అండదండగా నిలిచారు.. అంతేకాదు జగన్ ప్రభుత్వానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని.. జగన్మోహన్ రెడ్డి తనకు అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించారని కూడా చెబుతూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఇక ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేశానని కూడా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: