విచ్చలవిడిగా ప్రజాప్రతి నిధులు తాము ఎన్నికైన పార్టీలకు రాజీనామా చేయకుండా స్వంత ప్రయోజనాలకోసం అధికార పార్టీలొకి మారటం - ఆ దుష్కాముకాన్ని ప్రోత్సహించి విచ్చలవిడితనానికి పునాదులు వేసిన అధికారపార్టీ నాయకత్వం కూడా గుణపాఠం ఈ ఎన్నికల ద్వారా నేర్చుకోవాలి.
దీనికి ఉదాహరణగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ఫిరాయింపు రాజకీయాలకు అద్దంపడు తున్నాయి. అదికారపార్టీలోకి వస్తే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని, నేరాలన్ని సమసిపోతాయన్న అబిప్రాయం ఏర్పడింద ని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కొత్త దురాచారం ఒక రాజకీయ విదానంగా సంతరించుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేరే పార్టీ పతాకంపై గెలిచిన చట్ట సభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి వారిని నయాన్నో బయాన్నో వారిని ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించో అదలించో తప్పుడుపనులు చేస్తూ వాటిని తెలివైన రాజకీయ నిర్వహణగా అపర చాణక్యంగా చెప్పు కోవడం పరిపాటిగా మారిందన్నారు. వీటికి వ్యతిరేకంగా అంతా పోరాడాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఎన్నికల వ్యవస్థ లోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందన్నారు. సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ను తప్పుడు ప్రచారానికి వేదిక గా కూడా వాడుకుంటున్నారని,దీనిపై ఒక విధానం రూపొందించాలని ఆలోచిస్తున్నామని రావత్ తెలిపారు. ఇప్పుడు నంద్యాల్లో ప్రజలు తెలివిగా విఙ్జతగా వ్యవహరించి ఓటెస్తే కాగలకార్యం అతి సునాయాసంగా నెఱవేరుతుంది.
ఎన్నికల వాయిదాకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షనాయకులు పసిగట్టినట్లే తెలుస్తుంది. అందుకే నంద్యాల ప్రజలకు అద్బుతమైన అవకాశం వచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నంద్యాలలో ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలు అని, ఇంకొకటి అని కొత్తపల్లవి అందు కున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలకు బదులు చెప్పే అవకాశం నంద్యాల ప్రజలకు అందరికన్నా ముందుగా వచ్చిందని, దీనిని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
నిజంగానే నంద్యాలలో శాంతి భద్రతల సమస్య ఉంటే అందుకు సంబందించి పోలీస్, కలెక్టర్ నివేదిక ఉంటే బయట పెట్టా లని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వద్ద పోలీసుల నుంచి వచ్చిన ఒక నివేదిక ఉందని, అదేమిటంటే నంద్యాలలో వైసిపి గెలుస్తుందని మాత్రమేనని శ్రీధర్ రెడ్డి అన్నారు. నంద్యాల ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఛాలెంజ్ అని ఆయన అన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా తన దైన రీతిలో ప్రత్యేక శైలిలో వ్యవహరించటం కూడా ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టటమే. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల పరిశీలకులుగా ప్రధానంగా ముగ్గురు అధికారులను నియమించింది ఎన్నికల కమిషన్ (ఈసీ). సాధారణంగా ఒక పరిశీలకుడిని నియమిస్తారు.. అయితే నంద్యాల నియోజక వర్గానికి మాత్రం ఏకంగా ముగ్గురు పరిశీలకులను నియమించింది. ఈ ఉప ఎన్నిక విషయంలో ఆది నుంచి ఈసీ దగ్గరకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఓటర్ లిస్టులోకి ఇటీవలే చాలా ఎక్కువమందిని చేర్పించారనే ఆరోపణ వచ్చింది. నియోజక వర్గానికి సంబంధించని ఎంతో మంది పేర్లు ఓటర్ లిస్టులో నమోదయ్యాయనే ఫిర్యాదుపై స్పందించి, ఓటర్ లిస్టును పరిశీలించారు అధికారులు.ఇక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నంద్యాల్లో ఫిర్యాదుల పరంపర తీవ్ర స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఈసీకి ఫిర్యాదు చేసుకొంటూ వస్తున్నాయి.
ఈ క్రమంలో నంద్యాల డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ "ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాడు" అని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ బదిలీవేటు వేయడం ఆసక్తికరంగా మారింది. పోలింగ్ కు మరో నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో డీఎస్పీ గోపాలకృష్ణ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఓఎస్డీ రవిప్రకాష్ కు బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది.
ఈ ఎన్నికల ముఖ చిత్రం లో సానూభూతి పవనాల ప్రభావం అంతగా కనిపించటం లేదు. సానుభూతితో వారి వారసులను ఎన్నుకోవటం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వటమే. ఓటర్లు తమ వ్యక్తిత్వానికి ఆశలకు ప్రతీకైన ఓటును ఏదో ఏమోషన్ కు తలొగ్గి తాకట్టు పెట్టటమంటే తమ గోయి తాము త్రవ్వుకోవటమే. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్దులు లెవరూ అంత అమాయకులు, నిరుపేదలు కాదు. తరతరాలకు సరిపడా ప్రజాధనాన్ని పోగేసుకున్నవారే. తల్లిలేదు తండ్రిలేదు మాకు దిక్కులేదు అంటూ అనటం ఒక బిక్షగాళ్ళ లక్షణం. వారికి నాలుగు పైసలెయ్యటం ధర్మం. కాని వీరు కోరేది మీ ఓటు. అంటే మీ వ్యక్తిత్వానికి మీ భవిష్యత్ కు ప్రతీక. సానుభూతికి తలొగ్గి ఈ రాజకీయబిక్షగాళ్ళకు మీరు ఓటేస్తే మీ వ్యక్తిత్వాన్ని భవిష్యత్ ను వాళ్ళకు ధర్మం చేసినట్లే. ఆ తరవాత ఈ బిక్షగాళ్ళ నిజస్వరూపం ఎలాఉంటుందో మనకందరికి ఏడు దశాబ్ధాల స్వాతంత్రం రుచిచూపిస్తూనే ఉంది. తస్మాత్ జాగ్రత్త అని మాత్రం నంద్యాల ఓటర్లకు విఙ్జప్తి మాత్రం ఈ సంపాదకీయం ద్వారా చేస్తున్నాం.