తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొన్ని జిల్లాలు టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి.. తెలంగాణ ఉద్యమ గాలిలోనూ 2014ఎన్నికల్లో ఆ జిల్లాల్లో గులాబీ గుబాళింపు కనిపించలేదు. ప్రతిపక్షాలకు ఆ జిల్లాలు పట్టం కట్టాయి.. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చినా.. సీఎం కేసీఆర్ను మాత్రం కొంత భయం వెంటాడుతుందనే చెప్పాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయనీ, వంద సీట్లు గెలుచుకుంటామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి చెబుతున్నా..లోలోపల మాత్రం కొంత మదనపడుతున్నది మాత్రం వాస్తవం. ఆయా జిల్లాలో పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడకపోవడమే ఇందుకు కారణంగా పలువురు నాయకులు భావిస్తున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరినా.. పాత క్యాడర్తో వలసనేతలకు అస్సలే పొసగడం లేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్లో అన్ని సీట్లనూ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కరీంనగర్లో ఒక్క జగిత్యాల తప్ప మిగతా స్థానాలన్నంటింలోనూ గులాబీ గుబాళించింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ సత్తచాచాటింది. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సగానికి సగం కైవసం చేసుకుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలం చెందింది.
ఖమ్మంలో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో రెండు, రంగారెడ్డి జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. మిగతా స్థానాలన్నీ టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలు దక్కించుకున్నాయి. అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో ఉమ్మడి రంగారెడ్డి, గ్రేటర్హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలువురు విపక్షాల ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే ఆయా జిల్లాల్లో వసలతోనే టీఆర్ఎస్ పార్టీ బలపడింది. ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరినా.. క్షేత్రస్థాయిలో మాత్రం క్యాడర్ రాలేదనే టాక్ ఉంది. అంతేగాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు పాత టీఆర్ఎస్ క్యాడర్ను పక్కనపడేసి.. తమ వెంట వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో గ్రూపులు ఏర్పడి.. రచ్చకెక్కుతున్నాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో వలస ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తారా..? లేక గత ఎన్నికల్లో వీరిపై ఓడిపోయిన టీఆర్ఎస్ నేతలకు ఇస్తారా..? అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతంపై గులాబీ బాస్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో సత్తాచాటిన జిల్లాల్లోనూ ఈసారి కోతపడే అవకాశాలు ఉన్నాయి.