వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగనున్నారా ? గత ఎన్నికల్లో జగన్ తన తల్లి వైఎస్ విజయలక్ష్మీని విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వాత తాను ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తుండడంతో తనకు తోడుగా భారతీని సైతం పొలిటికల్ ఎంట్రీ చేయిస్తున్నారా ? అంటే వైసీపీలో అంతర్గత చర్చలను బట్టీ అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీ నుంచి జగన్తో పాటు ఆయన మేనమామ రవింద్రనాద్ రెడ్డి కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే జగన్ బాబాయి వైవీ. సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా నిన్నటి వరకు ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ ఏ పార్లమెంట్ స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరిని పోటీకి దింపాలనే అంశంపై వైసీపీలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక, సామాజిక కోణాల్లో బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ కీలక నాయకులు వేట మొదలెట్టారు. చాలా నియోజకవర్గాల్లో జగన్ ఎవరి అంచనాలకు అందని విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో ఓ ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని... ఆమెను వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయిస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కడప ఎంపీగా జగన్ కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చెయ్యడాన్ని నిరసిస్తూ ఆరుగురు వైసీపీ ఎంపీలను పదవులకు రాజీనామా చెయ్యడంతో అవినాష్ రెడ్డి సైతం తన పదవిని వదులుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే కడప జిల్లా నాయకులు దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ దూకుడు రాజకీయాలే పని చేస్తాయన్న నానుడి ఉంది. అయితే ఇందుకు పూర్తిగా విరుద్ధ స్వభావం కలిగి సౌమ్యుడిగా పేరున్న అవినాష్ రెడ్డి వల్ల పార్టీకి అంత సానుకూలత రావడం లేదని భావించిన జగన్ కొద్ది రోజులుగా అవినాష్ రెడ్డిని పక్కన పెడతారన్న వార్తలు వస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయాన తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా ఉన్న అవినాష్రెడ్డి సరిగ్గా పోల్ మేనేజ్మెంట్ చెయ్యలేదని సైతం జగన్ సీరియస్ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా మంత్రి ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
జమ్మలమడుగు నుంచి మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తే కడప నుంచి ఆదినారాయణ రెడ్డి రంగంలో ఉంటే వైసీపీని నిలువరించ వచ్చన్నదే టీడీపీ ప్లాన్. ఈ క్రమంలోనే ఇక్కడ టీడీపీ ఎత్తుకు పైఎత్తు వెయ్యాలంటే అవినాష్ రెడ్డి కన్నా భారతి అయితేనే గట్టి ప్రత్యర్థి అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ భారతిని కడప నుంచి లోక్సభకు పోటీ చేయించాలని జగన్ ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇదే సీటుపై వైఎస్ జగన్ సోదరి షర్మిల సైతం ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెడితే షర్మిలను ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేయించ వచ్చని మరో వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ ఊహాగానాలపై ఫైనెల్గా జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.