ఏపీ టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం పెద్ద అవమానం అయితే... ఇంకా చాలా అవమానాలే ఆయనను వేధిస్తున్నాయి. తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్ చేతిలో ఓడిపోవడం కానీ.... ఇప్పుడు జగన్ ముందే ప్రతిపక్షనేతగా ఉండాల్సి రావడం చంద్రబాబుకు పెద్ద అవమానం. అలాగే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా కేవలం 23 సీట్లకే పరిమితం కావడం మరో ఘోర అవమానం. ఇవన్నీ ఇలా ఉంటే టిడిపికి భవిష్యత్ లీడర్ గా ప్రాజెక్ట్ చేయాలని చంద్రబాబు భావించిన లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేక మంగళగిరిలో ఓడిపోవడం అవమానాలకే పెద్ద అవమానం. ఇలా తాజా ఎన్నికలకు చంద్రబాబుకు చాలా అవమానాలు మిగిల్చేశాయి.
ఇక మంగళగిరిలో ఈ ఎన్నికల్లో పోటీ చేసే ముందు లోకేష్ను అక్కడ పోటీ చేయించాలా ? వద్దా ? అని చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కొందరి స్వార్థం కోసం లోకేష్ బలయ్యాడా ? ఆయనను ఐదేళ్ల పాటు ఎంతో ఆర్థికంగా వాడుకుని .. బలవంతంగా మంగళగిరిలో పోటీ చేయించి... ఇప్పుడు బలిపశువును చేశారా ? లోకేష్ ఫ్యూచర్ను సర్వనాశనం చేశారా ? అంటే ఇప్పుడు అవుననే ఆన్సర్లు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. పార్టీకి అంతగా పట్టులేని, సామాజిక వర్గాల అంచనాలు తప్పడం.. ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1994లో పార్టీ గెలిచిన చోట లోకేష్ ను బలవంతంగా బరిలోకి దింపటం వెనక కొందరి స్వార్థం ఉందని... దానిని అంచనా వేయటంలో విఫలమైన లోకేష్ మంగళగిరిలో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని ఇప్పుడు చర్చలు స్టార్ట్ అయ్యాయి.
లోకేష్కు బాగా జాన్ జిగిరీ దోస్త్గా ఉన్న ఓ వ్యక్తి... ఆ ఉత్తమ స్నేహితుడు నాలుగేళ్లపాటు టిడిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని బాగా వెనకేసుకుని... ఇప్పుడు స్నేహితుడు రూపంలోనే ఆయనను కాటేశారని అంటున్నారు. ఈ స్నేహితుడు తన స్వార్థం కోసం లోకేష్ను మంగళగిరి రంగంలోకి దింపి భారీగా వసూలు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక లోకేష్ ఐటీ మంత్రి అయ్యాక మంగళగిరి సమీప ప్రాంతాల్లో కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు కూడా లోకేష్ అక్కడ గెలిస్తే ఐటీ కంపెనీల నుంచి తనకు నెలవారీ మామూళ్లు బాగా పిండుకోవచ్చు అన్న ఆశతోనే ఆ స్నేహితుడు లోకేషన్ అక్కడ బలవంతంగా పోటీ చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పేరు చెప్పి ఇప్పటికే సదరు స్నేహితుడు ఐటీ కంపెనీల నుంచి భారీగా వసూళ్లకు తెగపడ్డారట.
వచ్చేది తమ ప్రభుత్వమే అని... మీ కంపెనీలకు భారీ లబ్ధీ చేకూరుస్తానని చెప్పి ఆ కంపెనీల యజమానుల నుంచి గట్టిగా వసూళ్లు చేసి తన ఖాతాలో వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే లోకేష్ బాగా రాటుదేలేలా శిక్షణ ఇస్తానని చెప్పిన మరో వ్యక్తి కూడా ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచుతానని సొమ్ము తీసుకుని వాటిని పంచకుండా దుర్వినియోగం చేశారట. లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం వెనక ఆ వ్యక్తి కూడా బలవంతం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తి లోకేష్ దగ్గర తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేసిన విషయం తెలుసుకున్న లోకేష్ ఆ వ్యక్తిని తీవ్రంగా మందలించడంతో ఎన్నికలు ముగిసిన అప్పటి నుంచి ఆయన టిడిపి వర్గాలకు కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారట. ఏదేమైనా అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్టు లోకేష్ మంగళగిరిలో పోటీకి దిగినప్పుడే పెద్ద రిస్క్ చేశారని అందరూ భావించారు. చివరకు అందరూ అనుకున్నట్టే ఘోరమైన ఓటమితో రాజకీయ ఆరంభదశలోనే రాంగ్ స్టెప్ తో పెద్ద రిస్క్లో పడ్డాడు.