మొన్న స్పీచ్ లో పవన్ కళ్యాణ్ ఒకమాట అన్నారు 'జనసేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువగా ప్రజల హృదయాలు గెలుచుకుందని... నిజమే. ఓట్లు వెయ్యనివాళ్ళు కూడా పవన్ గెలవాలనే కోరుకున్నారు. కానీ, గెలిచే స్థాయిలో ఓట్లు మాత్రం ఎవ్వరూ వెయ్యలేదు, బహుశా ఇదేనేమో రాజకీయం అంటే. అయితే ప్రజలు తమని పరీక్షిస్తున్నారని పవన్ ఇప్పటికి బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ పరీక్షలో పోటీదారులు కూడా ఉంటారని.. వారి పోటీలో మనం నిలబడలేకపోయామని మాత్రం పవన్ అంగీకరించలేకపోతున్నాడు.
సినిమాల్లో హీరో ఎప్పటికైనా హీరోనే. కానీ రాజకీయాల్లో హీరోలు ఉండరు, అందరూ పాత్రదారులే. అందుకే ఏ రాజకీయ నాయకుడు తనని తానూ హీరోగా ఉహించుకోడు. మొన్న ఎన్నికల్లో హీరో అనిపించుకున్న జగన్ తో సహా. కానీ పవన్ సంగతికి వస్తే.. 'ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తా' అని మొన్న పవన్ చెప్పిన ఈ డైలాగ్ వింటే సరి. పవన్ తనని హీరోగా ఏ రేంజ్ లో ఉహించుకుంటారో. ఆ మాటకి వస్తే.. ఎన్నికలకు ముందు ఏపీకి కాబోయే సీఎం నేనే అని ఓవర్ గా పేలారు మన పవర్ స్టార్. చివరికీ ఫలితాలు పవన్ కళ్యాణ్ పరువునే తీసేసాయి. రెండు చోట్ల పోటీ చేసినా.. పవన్ గెలుపు రుచి చూడలేకపోయాడు.
ఫలితాలు చూసాకనైనా పవన్ లో మార్పు వస్తోందనుకుంటే.. ఇంకా ఆవే అరుపులు, ఆవే కేకలు.. ఆ తరువాత ఎవ్వరికీ కనిపించకుండా కొన్ని రోజులు మాయమవ్వడం. పవన్ ను చూసి ఆవేశ పడాలో... జాలిపడాలో జనసేకలకు కూడా అర్ధం కావట్లేదు. భవిష్యత్తు మనదే అని చెప్తున్న పవన్.. వాస్తవ పరిస్థుతులు ఎందుకు ఆలోచించట్లేదు. ప్రజలు డబ్బులు తీసుకున్నారు. కానీ ఓట్లు మాత్రం నచ్చిన వారికీ మాత్రమే వేశారు. అందుకే భారీగా డబ్బులు పంచిన టీడీపీ కూడా ఓడిపోయింది. దీనిబట్టి పవన్ ఓటమికి కారణం పవన్ చెప్పినట్లు ఆ 150 కోట్లు కాదు. పవన్ కళ్యాణ్ కి గెలిచే స్థాయిలో జనబలం లేకపోవడమే.
ఇక అధికారం లేనప్పుడే జనం హృదయాలను గెలుచుకున్న జగన్.. ఇక ఇప్పుడు అధికారం చేతిలో పెట్టుకుని జననేతగా ఎదిగలేరా..? ప్రస్తుతం జగన్ ఆలోచనాధోరణి చూస్తుంటే, ఏపి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా కనిపిస్తోన్నాడు. ఈ పరిణామాలన్నిట్ని దృష్టిలో పెట్టుకునే 'జగన్' ప్రభంజనంలో 'పవన్' రాజకీయం ఇక కష్టమేనని నిర్దారణకు వచ్చాకే.. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు లాంటి నాయకుడు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తాజా సమాచారం ప్రకారం మిగిలిన కొంతమంది నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.