రాష్ట్రంలో కొలువుదీరిన జగన్ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం, తన మిత్రుడు, దూరపు బంధువు కూడా అయిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఇక, అదే సమయంలో ఎస్సీ వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్కు కూడా మంత్రి వర్గంలో కీలకమైన విద్యాశాఖను అప్పగించారు. బాలినేని శ్రీనివాస్రెడ్డి గత ఎన్నికల్లో ఓడి ఈ ఎన్నికల్లో ఒంగోలు నుంచి విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి గెలిచిన ఆదిమూలపు సురేష్ ఈ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం అయిన యర్రగొండపాలెం నుంచి మరోసారి గెలిచి.. ఓవరాల్గా హ్యాట్రిక్ కొట్టారు.
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు చాలా జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా ప్రకాశంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల విజయం దక్కించుకుంది. ఈ క్రమంలో విద్యావంతులు, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకున్న జగన్.. ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవానికి జగన్ సునామీలో చాలా జిల్లాలు వైసీపీ పరం అయ్యాయి. అయినా కూడా ప్రకాశంలో మాత్రం నాలుగు చోట్ల టీడీపీ గెలిచింది. గత దశాబ్దంన్నర కాలంగా ఈ జిల్లాలో టీడీపీ సింగిల్ సీటుకు మాత్రమే పరిమితమవుతూ వచ్చింది. అలాంటిది ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు సీట్లు..అది కూడా ఫ్యాన్ ప్రభంజనంలో గెలవడం అంటే గొప్ప విషయమే. అంటే, రాబోయే రోజుల్లో ఈ పార్టీ మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిని బట్టి ఇక్కడ వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఆదిమూలపు సురేష్ మాజీ ఐఆర్ఎస్ అధికారి కావడంతోనే ఆయనకు విద్యాశాఖ కట్టబెట్టారు. ఇక కరువు సీమగా పేరున్న ప్రకాశం జిల్లాలో అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లాను పారిశ్రామికంగా తీర్చదిద్దడం, సాగు తాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేయడం, ఉన్నత విద్యకు సంబందించిన ఐఐటీ వంటి సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేవి కీలక అంశం. వెలిగొండ రిజర్వాయర్ పనులు టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టు మూలన పడింది. ఇప్పుడు దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది.
అదే సమయంలో ఐఐఐటీని ఏర్పాటు చేయించాలి. ఇక, దొనకొండను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న జిల్లా రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్లాలి. ఇక పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి. ఇక వెలుగొండ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తేనే పశ్చిమ ప్రకాశం రైతుల వెతలు తీరతాయి. ఇక పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో కాల్వల ఆధునికీకరణ లేకపోవడంతో ఇక్కడ కూడా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకే తలమానికమైన రిమ్స్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సహా జిల్లా నుంచి ఎంపికైన ఇద్దరు మంత్రులపై కీలక బాధ్యతలు ఉన్నాయనేది విస్పష్టం. ఈ నేపథ్యంలో ఎవరు ఎలా వ్యవహరిస్తారు. ఆయా సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.