ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమే చాలా వరకు ఆగిపోతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. మరోవైపు దేశంలో ఎక్కడిక్కడ పనులు ఆగిపోతున్నాయి. పెళ్లిళ్లు బంద్ చేసుకుంటున్నారు. పాఠశాలలు, కాలేజ్ లకు సెలవులు ఇచ్చేస్తున్నారు. ఇక మనుష్యుల వ్యక్తిగత జీవితానికి కూడా కరోనా బ్రేకులు వేసేసింది. ఇదిలా ఉంటే పవిత్ర దేవస్థానాల్లోనూ పూజలు, ఉత్సవాలు ఆపాల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఇక ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం విషయంలో అనేక మార్పులు చేశారు. ఇక ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ శ్రీశైలం మల్లన్నపై సైతం పడింది. శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మహోత్సవాలపై కన్నడ భక్తి బృందాలతో ఈవో కేఎస్ . రామారావు సమీక్ష నిర్వహించారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న సన్నిధిలో పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు వాయిదా వేశారు. ఉగాది ముందు రోజు జరిగే ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, అగ్ని గుండప్రవేశం, ఉగాది నాడు జరగాల్సిన రథోత్సవం కార్యక్రమాలు నిలుపు దల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు పలు కార్యక్రమాలు వాయిదా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 31వ తేదీ వరకు పాఠశాలలకు, కాలేజ్లకు సెలవులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.