కటక్ లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బారాబతి స్టేడియంలో సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ను ఎంచుకొని వెస్టిండీస్ జట్టుని బాటిగుకి ఆహ్వానించాడు. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి ఆడుతోంది. అందరూ ఊహించినట్టుగానే యువ పేసర్ నవదీప్ సైనీ భారత్ తరుపున అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విండీస్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే దిగింది.
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచాయి. దీనితో కటక్ వన్డే పోరు ఇరు జట్లకు కీలకమైనది. గెలిచిన జట్టుదే సిరీస్ కాబట్టి మ్యాచ్ కాస్త రసవత్తంగా సాగే అవకాశం ఉంది. బలాబలాలపరంగా భారత్ దే పైచేయి కలిపించినా ఈ పర్యటనలో విండీస్ ఆటను చూస్తే తక్కువగా అంచనా వేయడానికి అసలు వీల్లేదు. పదో ద్వైపాక్షిక సిరీస్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీసేన ఉంటే మరోవైపు 13 ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని విండీస్ పట్టుదలతో ఈ మ్యాచ్ లో దిగుతోంది.
ఇకపోతే బారాబతి పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి ఇక్కడ భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ మైదానంలో వన్డే జరిగి మూడు సంవత్సరాలు అవుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్లో ఏకంగా 747 పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడ కాస్త మంచు ప్రభావం ఉండనుంది. మ్యాచ్కు వర్షం నుంచి ఎటువంటి ముప్పులేదు.
ఇక తుది జట్ల విషయానికి వస్తే:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), హెట్మయెర్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, ఖారీ పైర్, కాట్రెల్.