ఇటీవలే ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై  గెలుపుతో  జోరుమీద ఉన్న భారత జట్టు అందరూ అనుకున్నట్లుగానే పసికూన హాంగ్కాంగ్ పైన కూడా ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక హాంకాంగ్ తో పోరులో ఏకపక్షంగా సాగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరి వరకు పోరాడి చివరికి భారత్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఇక వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు సూపర్ 4 లో అడుగు పెట్టింది అని చెప్పాలి.  ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజకత్ ఖాన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదమూడవ  ఓవర్ వరకు కూడా తమ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే క్రీజులోకి వచ్చాడో  పరిస్థితులు అన్నీ మారిపోయాయి అంటూ తెలిపాడు. అయితే భారత్తో జరిగిన మ్యాచ్లో తాము ఓడిపోయినప్పటికీ అటు టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్  బ్యాటింగ్ మాత్రం ఎంతగానో ఆస్వాదించాము  అంటూ నిజకత్ ఖాన్ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ బ్యాటింగ్ మంత్రముగ్ధుల్ని చేసింది అంటూ తెలిపాడు. అతను  వచ్చిన తర్వాతే మా జట్టు బౌలింగ్ లయ తప్పింది అంటూ తెలిపాడు.



 ఆసియా కప్ లో ఆడటం అనేది మా కుర్రాళ్లు అందరికీ కూడా ఒక సువర్ణవకాశంగా మేము భావిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ రోజు కోసం మేమంతా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాము.   ఈ క్రెడిట్ అంతా మా ఆటగాళ్లదే.  ఇక ఓటమి పై కారణాలు ఏంటి అన్నది రేపు కూర్చొని విశ్లేషణ చేస్తాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ ను బలహీనతలను అధిగమించి మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తాం అంటు నిజకత్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేధనకు దిగిన హాంకాంగ్ జట్టు 152 పరుగులకే పరిమితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: