గత యేడాది సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాతో రాంచరణ్ రెండువందల కోట్ల క్లబ్ లో చేరారు. దాంతో రాంచరణ్ మూవీస్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ బోయపాటి మార్క్ మామూలుగా ఉండదు..హీరోయిజాన్ని ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు.
ఈ నేపథ్యంలో రాంచరణ్ నటించిన ‘వినయ విదేయ రామ’సినిమాపై మెగా అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు సంక్రాంతికి ఫెర్ఫెక్ట్ సినిమా అవుతుందని అనుకున్నారు. అయితే వినయ విధేయ రామ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ ఇరగదీశాడని.. ఈ సినిమా ట్రాక్ తప్పడానికి కారణం డైరెక్టర్ బోయపాటేనని మండిపడుతున్నారు. రంగస్థలం తర్వాత వస్తున్న చరణ్ సినిమా కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, వాటినన్నింటినీ బోయపాటి వమ్ము చేశాడని తిట్టిపోస్తున్నారు.
కానీ, ఏపీ, నైజాంలో తొలిరోజు 26 కోట్ల షేర్ తీసుకొచ్చి సంచలనం సృష్టించింది వినయ విధేయ రామ. కొన్నిచోట్ల నాన్ బాహుబలి రికార్డులు కూడా తిరగరాసింది ఈ సినిమా. నైజాం 5 కోట్లకు పైగా వసూలు చేసిన రామ్ చరణ్ సినిమా.. సీడెడ్లో ఏకంగా ఏడు కోట్ల 15 లక్షలు వసూలు చేసింది. గుంటూరులో నాలుగు కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చి బాహుబలి వన్ రికార్డును దాటేసింది. ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ నటించింది. ఈ సినిమా డివివి దానయ్య నిర్మించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్, వివేక్ ఒబేరాయ్, స్నేహ,ఆర్యన్ రాజేష్ ముఖ్యపాత్రల్లో కనిపించారు.