ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటీ భగవంతుడే సృష్టించాడు. మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు ఇలా ప్రతి ఒక్కటీ ఆయన సారూప్యమే. దేవుడు మనకు కల్పించిన ఈ చిన్న జీవితంలో మనము కేవలం పాత్రధారులు మాత్రమే. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడడమే మన కర్తవ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వ్యవహరించాలి. కానీ కొంతమంది మాత్రం ఈ లోకంలో వారే గొప్ప అని, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలా బిహేవ్ చేస్తుంటారు. మనది కాని మన జీవితంలో, ఇలాంటి వారు ఎన్నెన్నో పొరపాట్లు చేస్తుంటారు. ఎంతో మంది దురాశ పరులు అన్యాయంగా అమాయకులను మోసం చేసి డబ్బు, ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు. ఇతరులను మోసగించి భారీగా ఆస్తిపాస్తులను కూడ పెట్టుకుంటుంటారు.

ఇలా చేయడం ఎంతవరకు సబబు అలాగే ఎంతవరకు న్యాయం అని వారికి వారే ఆలోచించుకోవాలి. మనది కానిది ఎదైనా పొందాలి అనుకోకూడదు. అలా సంపాదించే ఆస్తి మనకు ఆనందాన్ని ఇవ్వకపోగా మనశ్శాంతిని దూరం చేస్తుంది. అనారోగ్య పాలవవ్వడమో, కుటుంబంలో సమస్యలు తలెత్తడమో వంటివి జరుగుతాయని అని శాస్త్రాలు గోచరిస్తున్నాయి.
స్వార్థపూరితంగా ఆలోచించకూడదు. ఎదుటివారికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా చెడు మాత్రం చేయకూడదు. ఉన్నంతలో వీలైనంత ఇతరులకు సహాయం చేసిన వాడే నిజమైన ధనవంతుడు. ఇలాంటి వారికి దేవుడు కూడా అండగా ఉండి ముందుకు నడిపిస్తారు.

మనకు మించిన ఆస్తులు డబ్బు కూడపెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన నేడు బాగుంటుందేమో కానీ రేపటి రోజున కష్టాలు తప్పవు. పాపం ఏదో విధంగా మనల్ని వెంటాడుతుంది. కాబట్టి నిస్వార్థంగా ఆలోచించడం, ఉన్నంతలో సంతోషించడం నేర్చుకోవడం ఎంతైనా మంచిది. డబ్బు సంపాదించడం  కోసం చేసే ఏ పనైనా నీతిగా నిజాయితీగా, వేరొకరిని మోసం చేయకుండా ఉండాలి. అప్పుడే ఆ ధనం వలన మనకు మన కుటుంబానికి మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: