కులాంతర వివాహం చేసుకున్న కొడుకును తల్లిదండ్రులు ఇంట్లోకి రానియకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల మహేష్(32) ఏడాదిన్నర కిందట అదే గ్రామానికి చెందిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ హైదరాబాద్లో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు.కొద్దికాలం సాఫీగానే సాగినా.. ఆమె తల్లిదండ్రుల ఎంట్రీతో ఇక ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకున్నారు.
పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి తనను విడిచి వెళ్లిపోవడంతో మహేష్ మానసికంగా బాగా కుంగిపోయాడు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మహేష్ స్వగ్రామానికి వెళ్లాడు. అయితే కులాంతర వివాహం చేసుకున్నావంటూ కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానీయలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందాడు. నమ్మి వచ్చిన యువతి పెళ్లి చేసుకున్నాకా మధ్యలో విడిచి వెళ్లిపోయిందనే బాధ, తల్లిదండ్రులు తనను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇంట్లోకి రానీయకుండా ప్రవర్థిస్తున్నారనే మనస్తాపంతో మనోవేదనకు గురై గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన కొడుకు అంత పిరికివాడు కాదని, అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తండ్రి రాములు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటూ దూషించి ఇంటి తలుపులు మూసేయడాన్ని మేము చూశామని పలువురు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా యువతితో సంభాషించిన కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple