న‌ల్గొండ జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో సర్పంచ్‌ కుటుంబం దుర్మరణం పాలైంది. పెద్దవూరు మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్‌ తరి శ్రీనివాస్‌(34), ఈయన భార్య విజయ(30), కుమార్తె శ్రీ‌విద్య(5)‌, కుమారుడు క‌న్న‌య్య‌(3) మృత్యువాత ప‌డ్డారు. శ్రీ‌నివాస్‌, విజ‌య అక్క‌డిక్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌వ‌గా, పిల్లలిద్ద‌రూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూయ‌డం అంద‌రి హృద‌యాల‌ను క‌ల‌చివేసింది. ప్ర‌ధాన రహదారిపై వెళుతున్న లారీ అదుపు తప్పి పుచ్చకాయల లోడు‌తో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆ ఆటో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సర్పంచ్‌ కుటుంబం లారీ కిందపడి దుర్మరణం పాలైంది. ఆటో డ్రైవర్‌కు గాయాలవ‌గా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స‌నందిస్తున్నారు. ఇదే జిల్లాలోని చింతగూడెం స్టేజీ వద్ద ఉద‌యం టిప్పర్ - లారీ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వ‌రుస‌గా రెండు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో జిల్లాలో విషాదం నెల‌కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: