వేసవి కాలం ఇంకా ముదరకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు ఒక నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అటు ఉపరితల ఆవర్తనం, ఇటు వడగాల్పులు.. వెరసి తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు మెరుపులతో జల్లులు పడే అవకాశం ఉందని, మూడు రోజులపాటు ఏపీ, కర్ణాటకలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పింది.రాబోయే పది రోజుల్లో ఎండ తీవ్రత మరింతపెరిగే అవకాశం ఉందని తెలిపింది.


తెలంగాణలో టెంపరేచర్ !

తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా పది రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా తక్కువ ఏమీ లేదు, ఇక్కడ కూడా 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది.



ఏపీలో ఎండలు.. అకాల వర్షాలు !

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రాయలసీమలో ఎండలు మండిపోతుంటే, కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, విజయవాడ, రాజమండ్రి, నంద్యాల, గూడూరు వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని 16 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.




వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త!

భానుడి భగభగలకు విరుగుడుగా అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.

మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.

వడగాల్పులు వీస్తున్న సమయంలో తలకు గుడ్డ కట్టుకోవడం లేదా గొడుగు వాడటం తప్పనిసరి.

శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి (నీళ్లు, కొబ్బరి నీళ్లు, తాటి ముంజలు వంటివి తీసుకోవాలి).

పిడుగుల హెచ్చరిక ఉన్న ప్రాంతాల్లో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దు.

ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో ఈ ఎండలు చూపిస్తున్నాయి. భానుడి ప్రతాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి


మరింత సమాచారం తెలుసుకోండి: