![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/debate/138/sharmila56cbbd9a-c8b1-4924-9943-7c16e4564f22-415x250.jpg)
పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేయలేని పనిని ఆమె చేసి చూపించింది. దాదాపు పార్టీ పెట్టి మూడో ఎన్నికను ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ కు సాధ్యం కానీ అంశాన్ని చాలా సులభంగా చేయగలిగింది. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటంటే.. అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం. ఈ అభ్యర్థుల్లో కూడా మార్పులు చేర్పులు చేయడం.. ఏపీ కాంగ్రెస్ లో కూడా టికెట్ల కోసం డిమాండ్ ఉండేలా చేయడం ఆమె సాధించిన విజయాలుగా చెప్పవచ్చు.
ఈ విషయంలో ఆమెను చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ గత ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థులను బరిలో దింపనే లేదు. బీజేపీ సైతం పొత్తు లేకుండా వెళ్లే సాహసం చేయలేకపోయింది. కానీ షర్మిళ చాలా సునాయసంగా ఈ క్రతువును పూర్తి చేశారు. తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్ఠానం ప్రకటనను జారీ చేసింది.
ఈ జాబితాలో మొత్తం 28 స్థానాలకు అభ్యర్థులు ఉండగా.. గతంలో ప్రకటించిన పది స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. నాలుగో దశలో జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 154 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ఔరా అనిపించింది. మిగతా స్థానాలు మిత్ర పక్షాలు ఇండియా కూటమికి కేటాయించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడంలో ఆమె విజయవంతం అయ్యారనే చెప్పవచ్చు.