150  సీసీ బైక్.. 60 సీసీ లూనాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వేరే ఊరు వెళ్లాలి. మీరు ఏ వాహనాన్ని కోరుకుంటారు. ఇదేం ప్రశ్న. బుర్ర ఉన్నోడు ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్ననే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాల్సిన టైం వచ్చింది. ప్రపంచ మొత్తానికి అవసరమైన ఐటీ ఉత్పత్తుల్ని ఐటీ.. ఇంజినీర్లను ప్రొడ్యూస్ చేసే దేశంలో ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఎంత శాతం నమోదు అయిందనే లెక్కలు చెప్పడానికి 48 గంటల కంటే ఎక్కువ టైం పడుతుందా? ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోను దశాబ్ధాల కాలం నాటి విధానాలను పాటించడంలో అర్థం ఉందా? అనేదే ఇప్పుడు ఈసీ ముందున్న ప్రశ్న.


ఈ సారి సార్వత్రిక ఎన్నికలను ఏడు దశలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు రెండు గంటలోకాసారి ఎంత శాతం పోలింగ్ నమోదు అయిందనే లెక్కలను చెబుతారు. ఇవి కచ్ఛితమైన శాతం కాకపోయినా కొద్ది శాతం తేడా అటూ ఇటూ ఉంటుంది. కానీ పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు మాత్రం 48 గంటలు తీసుకుంటారు. ఇదే విషయంపై సుప్రీం కోర్టుని కొంతమంది ఆశ్రయించారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది.


పోలింగ్ సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు అని అడిగింది. పోలింగ్ పూర్తి అయిన తర్వాత డేటా ను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ ఎందుకు వెబ్ సైట్ లో ఉంచలేకపోతుందో అన్న ప్రశ్నను సంధించింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రి సభ్య ధర్మాసనం ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు ముందుంచింది. వీటిపై వారంలోగా జవాబు ఇవ్వాలని వాయిదా వేసింది.  గత నాలుగు దశల ఎన్నికల పోలింగ్ లో పదే పదే గణాంకాల్ని ఈసీ మార్చడంతో దీనిపై ప్రతిపక్షాలు సైతం పలు సందేహాలను వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: