ఇంటర్నట్  .. ఎక్కడ ?

పేద  విద్యార్థులు ఆన్ లైన్   విద్యను అందుకునేందుకు సులువుగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాన్నీ తాజాగా  కోరింది. కోవిడ్-19 పరిణామాల మూలంగా ఆన్ లైన్ తరగతులు విద్యార్థులకు అనివార్యం అయ్యాయని, దీనికి అనుగుణంగా  చర్యలు చేపట్టాలని  భారత సర్వోన్నత న్యాయ స్థానం పలు సూచనలు చేసింది. ఆన్ లైన్ విద్యను అభ్యసించడంలో వెనుకబడిన తరగతుల వారు  చాలా నష్టపోతున్నారని న్యాయస్థానం అభిప్రాయ పడింది.

 విద్యాహక్కు చట్టాన్ని (ఆర్.టి.ఇ) ని సక్రమంగా అమలు చేయాలని పేర్కోన్న న్యాయస్తానం ఆ దిశగా చేపడుతున్న చర్యలను ప్రజలందరికీ తెలియ జేయాలని సూచించింది. ఢిల్లీ హై కోర్టు 2020 సెప్టంబర్ 18 న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తాజాగా సమర్థించింది. విద్యార్థులు అన్ లైన్ పాఠాలు నేర్చుకునేందుకు అనువుగా అవసరమైన అన్ని వనరులను  సమకూర్చాలని ఢిల్లీ హై కోర్టు నాడు తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ యాక్షన్ కమిటీ పేరుతో ఉన్న యూనియన్  సవాల్ చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన న్యాయస్థానం ఈ కేసును విచారణ చేసింది.  ఢిల్లీ  ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వాదనలను కూడా ఆలకించింది. రాజ్యాంగంలో ని ఆర్టికల్  21 ప్రకారం అందరికీ విద్యను అందించాల్సి ఉందని తెలిపింది. దీని నుంచి ఎవరూ తప్పించుకో జాలరని స్పష్టం చేసింది.

పేద విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు చదువుకునేందుకు అవసరమైన వనరులు కల్పించాలని,  ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ వంటివి అందజేయాలని సూచించింది.  డబ్బులున్న సంపన్న కుటుంబాలకు మాత్రమే విద్యను అందిస్తాం అంటే కుదరదని పేర్కోంది.  సామాన్యులకు విద్యావకాశాలు  కల్పించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని, దీనిని ఎవరూ మరువ రాదని న్యాయస్థానం పేర్కోంది. సమాజంలో కొందరికి విద్యను అందించి, మరి కొందరికి అందిచ పోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని  కూడా కోర్టు ప్రశ్నంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. సమాజంలో  వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరిగి పోవడం మంచిది కాదని, భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదాలకు దారి తీస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: